ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నం?
టేకుమట్ల: కడవరకు నీతోనే ఉంటానని పెళ్లినాటి ప్రమాణాలను మరిచిన ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నానికి పాల్పడింది. విద్యుదాఘాతంతో మృతిచెందినట్లు చిత్రీకరించే ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో బుధవారం జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వివాహిత, మరో గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని, అతన్ని చంపాలనుకుంది.
మంగళవారం రాత్రి భర్త పడుకున్న సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. లైట్ ఆఫ్ చేసి, భర్త కాళ్లకు విద్యుత్ తీగలను అమర్చి ఆత్రుతగా స్విచ్ బోర్డ్లో విద్యుత్ సరఫరా లేని ప్లగ్లో పెట్టగా విద్యుత్ సరఫరా కాలేదు. వెంటనే ఇద్దరు కలిసి వేరే ప్లగ్లో పెట్టాలని మాట్లాడుకుంటున్న క్రమంలో భర్తకు మెలకువ వచ్చింది. ఎవరంటూ అరవడంతో ప్రియుడు పరార య్యాడు. వెంటనే లైట్లు ఆన్ చేయగా కాళ్లకు అమర్చిన విద్యుత్ వైర్లు, కరెంటు సరఫరాలేని ప్లగ్లో పెట్టడాన్ని గమనించి గ్రామస్తులకు తెలిపాడు. స్థానిక సర్పంచ్ సదరు మహిళను పోలీస్స్టేషన్లో అప్పగించినట్లు సమాచారం.


