మహిళా దినోత్సవం రోజున దారుణం.. | Acid Attack On Married Women In Medak | Sakshi
Sakshi News home page

Medak: వివాహితపై యాసిడ్‌ దాడి

Mar 8 2021 11:08 AM | Updated on Mar 9 2021 8:54 AM

Acid Attack On Married Women In Medak - Sakshi

సాక్షి, మెదక్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే మెదక్‌ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ కిరాతకుడు మహిళపై పెట్రోల్‌ లాంటి మండే పదార్థం పోసి నిప్పంటించాడు. అల్లాదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గడిపెద్దాపూర్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. టేక్మాల్‌ మండలం మల్కాపూర్‌ (అంతాయపల్లి) తండాకు చెందిన 42 ఏళ్ల మహిళ భర్త పదేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో ఆమె తన ఇద్దరు కూతుళ్లతో కలసి తల్లి గారింటి వద్ద ఉంటూ కూలి పనులు చేసి జీవనం సాగిస్తోంది. ఈ వితంతు మహిళకు, పశువుల వ్యాపారం చేసే సాదత్‌తో డబ్బుకు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి తనకు చెల్లించాల్సిన డబ్బు గురించి చర్చించేందుకు ఆమె సాదత్‌ వద్దకు వెళ్లింది.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. సాదత్‌ పెట్రోల్‌ లాంటి మండే పదార్థాన్ని ఆమెపై పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. 70 నుంచి 80 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను గమనించిన గ్రామస్తులు. 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. బంధువులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను జోగిపేట ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం అక్కడి నుంచి సంగారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో తేలిన అంశాల మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని.. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.

చదవండి: ఎంత కర్కశం: తోబుట్టువులనే కనికరం లేకుండా..

Advertisement
 
Advertisement
Advertisement