హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై గంటకు 200 కిలోమీటర్ల వేగంతో కారును నడిపి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతోపాటు టోల్ సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేసిన వ్యక్తిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలకాపూర్ టౌన్షిప్కు చెందిన కొత్తపల్లి యశ్వంత్రెడ్డి గత ఏప్రిల్లో వోక్స్ వ్యాగన్ విర్టస్ కారును కొనుగోలు చేశాడు. దాని వేగాన్ని పరీక్షించేందుకు ఈ నెల 10న నార్సింగి టోల్గేట్ వద్ద ఔటర్రింగ్ రోడ్డు ఎక్కి కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడిపాడు.
దాన్ని తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశాడు. దాన్ని గమనించిన పెట్రోలింగ్ అధికారి కె.సాయిరాం ఈ నెల 19న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో కేసు నమోదు చేసి ఆదివారం అతడితోపాటు కారును అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, ప్రమాదకర స్టంట్లు చేయటం, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తామని, ఇలాంటి చర్యలతో అమాయక ప్రయాణికులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందన్నారు.


