ధనీకరణ విధానం ద్వారా రూ.16.72 లక్షల కోట్లు
సమకూర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక
వచ్చే ఐదేళ్లలో పలు కీలక రంగాల ఆస్తులు, సేవలు, వ్యవస్థల ప్రైవేటీకరణ
జాబితాలో రైల్వేలు, హైవేలు, విమానయానం, విద్యుత్, బొగ్గు,మైనింగ్, పర్యాటక రంగాలు
రైల్వే పీఎస్యూల్లో పెట్టుబడుల పాక్షిక ఉపసంహరణకు నిర్ణయం
‘నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ 2.0’ పేరుతో నీతి ఆయోగ్ కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ధనీకరణ (మానిటైజేషన్) విధానాన్ని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించింది. రానున్న ఐదేళ్లలో 12 కీలక రంగాలకు సంబంధించిన ఆస్తులతో పాటు సేవలు, వ్యవస్థలను ప్రైవేటీకరించడం ద్వారా రూ.16.72 లక్షల కోట్లు సమకూర్చుకోనుంది. ‘నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ 2.0’ పేరుతో నీతి ఆయోగ్ ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. దీని ప్రకారం జాతీయ రహదారులు, రైల్వేలు, విద్యుత్, పెట్రోలియం, సహజవనరులు, పౌర విమానయానం, పోర్టులు, వేర్హౌసింగ్, పట్టణ మౌలిక సదుపాయాలు, బొగ్గు, గనులు, టెలికాం, పర్యాటక రంగాలకు సంబంధించిన ఆస్తులు, సేవలను కేంద్రం ప్రైవేటు పరం చేయనుంది. తద్వారా వాటి విలువను నగదు రూపంలోకి మార్చుకోనుంది. 
రాష్ట్ర ఆదాయం సంచిత నిధికి జమ
ధనీకరణ అమలుకు డిజైన్, బిల్డ్, ఆపరేట్, మెయింటెయిన్ (డీబీవోఎం), డిజైన్, బిల్డ్, ఆపరేట్ (డీబీవో) డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్వోటీ), ఆపరేట్, మెయింటెయిన్, ట్రాన్స్ఫర్ (ఓఎంటీ), పబ్లిక్ ప్రైవేట్ భాగస్వా మ్యం (పీపీపీ), పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో/ఎఫ్పీవో) పద్ధతులను అవలంబించనుంది. ఈ పద్ధతుల్లో భాగంగా కొన్ని సందర్భాల్లో ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా ఆయా ఆస్తులు ప్రైవేటు సంస్థల చేతుల్లోనే ఉండేలా ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాలకు ఆదాయం లభిస్తే దాన్ని ఆయా రాష్ట్రాల సంచిత నిధి (కన్సాలిడేటెడ్ ఫండ్)కి జమ చేయనుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రభుత్వం యాజమాన్య హక్కును నిలుపుకుంటూ, ఆస్తులను ఒక నిర్ణీత కాలానికి లీజుకు ఇస్తుంది.
కీలక రంగాల మానిటైజేషన్ ఇలా.. 
అధిక నగదు సృష్టే లక్ష్యం
రైల్వే ప్రైవేటీకరణతో పాటు రైల్వే పీఎస్యూల్లో పాక్షిక పెట్టుబడుల ఉపసంహరణ కూడా చేయనుంది. వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా కొత్త రంగాలతో ధనీకరణను విస్తృతం చేయడం, 2026–27 నుంచి 2030–31 వరకు జీడీపీకి సహాయకారిగా ఉండేలా ఎక్కువ మొత్తంలో నగదును సృష్టించడం ఈ మానిటైజేషన్ లక్ష్యాలని, కేబినెట్ సెక్రటరీ పర్యవేక్షణలో ఉండే ఒక అధికారిక కమిటీ అసెట్ మానిటైజేషన్ డాష్బోర్డ్ ద్వారా పర్యవేక్షిస్తూ ఈ ప్రాజెక్టును అమలు చేస్తుందని నీతిఆయోగ్ వెల్లడించింది.


