సాక్షి, చైన్నె: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి గురువారం నుంచి 30వ తేదీ వరకు ప్రతిరోజూ 150 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తమిళనాడు రవాణా శాఖ ప్రకటించింది. ప్రకటన విడుదల చేశారు. తిరుపతికి చైన్నె కోయంబేడు నుంచి తమిళనాడు బస్సులు ఓ వైపు, మాధవరం నుంచి ఆంధ్రా బస్సులు మరో వైపు తిరుపతితోపాటుగా తిరుమలకు రోడ్డెక్కిస్తూ వస్తున్నారు. అలాగే, కాంచీపురం , వేలూరుల నుంచి సైతం బస్సులు నడుస్తున్నాయి. అయితే, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తమిళనాడు నుంచిఅత్యధికంగా భక్తులుతరలి వెళ్లడం జరుగుతున్నది. దీంతో తమిళనాడు ప్రభుత్వ ఎక్స్ప్రెస్ రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రత్యేక బస్సుల వివరాలను బుధవారం ప్రకటించారు.
ప్రత్యేక సర్వీసులు
బ్రహ్మోత్సవాలకు తరలివెళ్లే భక్తుల సౌకర్యార్థం చైన్నె, తిరుచ్చి, తంజావూర్, సేలం, కోయంబత్తూర్, మదురై, కారైక్కుడి, కుంభకోణం, నాగప ట్నం, సెంగోట్టై , పుదుచ్చేరి, తిరుపత్తూర్, తిరువణ్ణామలై, కాంచీపురం, తాంబరం, కృష్ణగిరి, ధర్మపురి, హరూర్, హోసూర్ తదితర ప్రాంతాల నుంచి తిరుపతికి ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. సాధారణంగా నడిచే బస్సులతో పాటుగా అదనంగా 150 ప్రత్యేక బస్సులను ఆయా ప్రాంతాల నుంచి నడపున్నామని వివరించారు.
ముందస్తు బుకింగ్ సదుపాయం:
తిరుచ్చి, తంజావూర్, సేలం, కోయంబత్తూర్, మదురై, కారైక్కుడి, కుంభకోణం, నాగపట్నం, సెంగోట్టై , పుదుచ్చేరి ప్రాంతాల నుంచి నడిచే బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామన్నారు. భక్తులు తమ ప్రయాణానికి సంబంధించి టీఎన్ఎస్టీసీ. ఇన్ వెబ్ సైట్ లేదా మొబైల్యాప్ ద్వారా ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చునని ప్రకటించారు.


