సాక్షి, చైన్నె: పుట్టుకతోనే తీవ్రమైన గుండె సమస్యలతో బాధపడుతున్న పేద పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు అందించి నూతన జీవితాన్ని ప్రసాదించే హీలింగ్ టైనీ హార్ట్స్ 6వ ఎడిషన్ను రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ ఈస్ట్, చైన్నెలోని అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్తో కలసి ప్రారంభించాయి. ఈ కార్యక్రమంలో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్టిఎన్. డి. సురేష్ జైన్, ఎల్టీఎమ్ ఫౌండేషన్ గ్లోబల్ హెడ్ అర్చన సహాయ్, అపోలో హాస్పిటల్స్ చైన్నె రీజియన్ సీఈఓ డాక్టర్ ఇలంకుమరన్ కళియమూర్తి తదితరులు పాల్గొన్నారు. 2021 జూన్లో ప్రారంభమైన ఈ మిషన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన చిన్నారులకు ప్రాణరక్షణ కల్పించే ఉచిత గుండె ఆపరేషన్లు అందిస్తున్నారు. ఈ 6వ ఎడిషన్ ద్వారా ఏడాది కాలంలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 500 మంది పేద పిల్లలను గుర్తించి, ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వైద్య బృందండాక్టర్ నెవిల్ సొలొ మొన్ నేతృత్వంలో, డాక్టర్ ముత్తు బృందం ఈ శస్త్రచికిత్సలను నిర్వహించనున్నారని రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ ఈస్ట్ అధ్యక్షురాలు రాధికా సత్యనారాయణ ప్రకటించారు.
తిరువొత్తియూరు: కొత్త చాకలి పేటలో ఇనుప రాడ్తో దాడి చేసి రౌడీని హత్య చేసిన నిందితుల ముఠా కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వివరాలు.. పుదువన్నార పేటలోని పూండి తంగమ్మాళ్ స్ట్రీట్ స్లమ్ క్లియరెన్స్ బోర్డు నివాస ప్రాంతంలో ఒక యువకుడు మృతి చెంది పడి ఉన్నట్లు స్థానికులు కాశిమేడు ఫిషింగ్ హార్బర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమాచారం మేరకు శనివారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం జరిపిన విచారణలో, మరణించిన యువకుడు కొత్త చాకలి పేట పూండి తంగమ్మాళ్ వీధికి చెందిన నరేష్ కుమార్ (24) అని, అతను ప్రముఖ రౌడీ కుల్లా కార్తీక్ ముఠాకు చెందినవాడని తేలింది. ఇతనిపై కొత్త పేట, కాశిమేడు ఫిషింగ్ హార్బర్ సహా పలు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. నరేష్ కుమార్ శరీరంపై పలు గాయాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, ఇనుప రాడ్ వంటి వస్తువులతో దాడి చేయడం వల్ల మరణం సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.


