సాక్షి, చైన్నె: పుదుచ్చేరిలో మంత్రుల శాఖల కేటాయింపు ఆమోదంలో చోటుచేసుకుంటున్న ఆలస్యంపై ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాఖల కేటాయింపు ప్రక్రియ ఎందుకు ఆలస్యమవుతోందో తనకే అర్థం కావడం లేదని అయోమయం వ్యక్తం చేశారు.
ఎన్సీసీ కెడెట్ల సముద్ర సాహస యాత్ర ప్రారంభం
ఎన్సీసీ కెడెట్లు చేపట్టిన తూర్పు తీర సముద్ర నౌకాయాన యాత్ర – 2026 ను పుదుచ్చేరి తేంగాయ్త్తిట్టు చేపల రేవు వద్ద సీఎం రంగ స్వామి ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. ఈయాత్ర సోమవారం నుంచి నుండి సెప్టెంబరు 27 వరకు కొనసాగనుంది. మొత్తం 100 మంది కేడెట్లు పాల్గొంటున్నారు. పుదుచ్చేరి నుండి కడలూర్, రామేశ్వరం, తూత్తుకుడి, కన్యాకుమారి మీదుగా చైన్నె వరకు మొత్తం 800 కిలోమీటర్ల మేర ఈ సముద్ర యాత్ర సాగనుంది. విద్యార్థులకు సముద్ర సాహస యాత్రల వలన్ల మనోధైర్యం, ప్రతికూలతలను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతాయని, దేశ భవిష్యత్తు పిల్లల చేతుల్లోనే ఉందని ఈసందర్భంగా సీఎం పేర్కొన్నారు.
శాఖల కేటాయింపులో వివాదం
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సీఎం రంగస్వాసామితో పాటు ఐదుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మంత్రులకు శాఖల కేటాయింపు విషయంలో ఎన్.ఆర్. కాంగ్రెస్ – బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు, మొండిపట్టు కొనసాగుతున్నాయి.జూలై 20న మంత్రుల శాఖల కేటాయింపుల నివేదికను సీఎం రంగస్వామి లెఫ్టినెంట్ గవర్నర్ కై లాష్నాథన్కు సమర్పించారు. గంటల్లో ఆమోదం వస్తుందని భావించినప్పటికీ, వారం రోజులు గడిచినా ఎల్జీ నుండి అనుమతి లభించలేదు. గతంలో మాదిరిగా ఈసారి కూడా కీలక శాఖలను తమకే కేటాయించాలని కూటమి భాగస్వామి అయిన బీజేపీ ఒత్తిడి తెస్తున్నందునే ఎల్జీ సంతకం చేయడం లేదని ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, తనకే తెలియడం లేదని అయోమయం వ్యక్తం చేయడం గమనార్హం.అలాగే, బీజేపీ ఏమైనా ప్రాధాన్యత ఉన్న శాఖల కోసం ఒత్తిడి తెస్తోందా? అని ప్రశ్నించగా, సీఎం స్పందించకుండా కేవలం ‘నమస్కారం’ అని చెబుతూ అక్కడి నుండి వెళ్లిపోయారు.


