సాక్షి, చైన్నె: మాజీ మంత్రి, డీఎంకే ఎమ్మెల్యే ఆర్. వైద్యలింగంకు సంబంధించిన రూ.28 కోట్ల అవినీతి కేసులో పునర్విచారణ చేపట్టేందుకు చైన్నె ప్రిన్సిపల్ సెషనన్స్ కోర్టు అనుమతినిచ్చింది. ఈ విచారణను త్వరగా ముగించి మూడు నెలల వ్యవధిలో తుది నివేదికను దాఖలు చేయాలని అవినీతి నిరోధక శాఖను న్యాయమూర్తి ఆదేశించారు. 2011–2016 మధ్య అన్నాడీఎంకే ప్రభుత్వంలో వైద్యలింగం గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో చైన్నె పెరుంగళత్తూరులోని శ్రీరామ్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడానికి రూ. 28 కోట్ల లంచం తీసుకున్నారని అరప్పోర్ ఇయక్కమ్ ఆరోపించింది. ఆధారాలతో సహా ఆ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతతో 2022లో అవినీతి నిరోధక శాఖ దృష్టి పెట్టింది. ఈ ఫిర్యాదు ఆధారంగా 2024 సెప్టెంబరులో కేసు నమోదు చేసింది. కాగా, ఈ ఏడాది జనవరిలో వైద్యలింగం అన్నాడీఎంకే పార్టీని వీడి డీఎంకే పార్టీలో చేరారు.అదే సమయంలో వైద్యలింగంపై మోపిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులు కోర్టులో నివేదిక సమర్పించారు.
కోర్టు తాజా ఆదేశాలు
రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ, పరిపాలనా మార్పుల నేపథ్యంలో, గతంలో సమర్పించిన కేసు మూసివేత నివేదికను ఉపసంహరించుకుని, ౖవైద్యలింగంపై మళ్లీ సమగ్ర విచారణ జరిపేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆ శాఖ అధికారులు కోరారు. ఈ విజ్ఞప్తిపై విచారణ జరిపిన ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎస్. కార్తికేయన్, మాజీ మంత్రి ౖవైద్యలింగంపై మరింత విచారణ జరిపేందుకు కేసు పునర్విచారణకు అవినీతి నిరోధక శాఖకు అనుమతినిచ్చారు. అలాగే 3 నెలల వ్యవధిలోనే విచారణ పూర్తి చేసి విచారణ కోర్టుకు తుది నివేదికను సమర్పించాలని ఆదేశించారు.


