వేలూరు: యువతతో పాటూ విద్యార్థులు మత్తుకు బానిస కాకుండా దూరంగా ఉండాలని కలెక్టర్ లీల అలెక్స్ అన్నారు. ప్రపంచ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని వేలూరు జిల్లా కాట్పాడిలోని ప్రభుత్వ పాఠశాల బాలుర ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడుతూ దేశంలోని యువత అధిక భాగం మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని వాటి నుంచి యువత బయట పడాలన్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోని యువకులే అధికంగా మత్తుకు బానిస అవుతున్నారన్నారు. ఒకసారి మత్తు పదార్థాలను వాడటం వల్ల తరచూ వాడాలనిపిస్తుందని వాటికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పయణి, విద్యాశాఖ సీఈఓ ప్రేమలత, మత్తు పదార్థాల వ్యతిరేక విభాగం అధికారులు, పోలీసులు, పాఠశాల విద్యార్థులు, టీచర్లు పాల్గొన్నారు.


