సాక్షి, చైన్నె: చైన్నెలోని ఎస్ఆర్ఎమ్ ప్రైమ్ హాస్పిటల్ వైద్యులు బిహార్కు చెందిన 23 ఏళ్ల యువతికి అత్యంత సంక్లిష్టమైన, అధునాతన లాపరోస్కోపిక్–అసిస్టెడ్ స్ప్లెనెక్టమీ శస్త్ర చికిత్స విజయవంతం చేశారు. ఆమె కడుపు నుంచి రికార్డు స్థాయిలో 2.8 కిలోల బరువున్న భారీ ప్లీహాన్ని తొలగించారు. సాధారణంగా ప్లీహం చాలా తక్కువ బరువు ఉంటుందని, అయితే, ఈమె శరీరంలో అది అసాధారణంగా పెరిగిపోవడంతో పాటు పలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఈ శస్త్ర చికిత్సను కీ హోల్ ద్వారా నిర్వహించారు. యువతి తీవ్రమైన నీరసం, శారీరక బలహీనత వంటి సమస్యలతో బాధపడుతుండడంతో బిహార్లో పరీక్షలు చేశారని, మెరుగైన చికిత్స నిమిత్తం చైన్నెకు తీసుకొచ్చినట్టు ఆస్పత్రి మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ – హెపటాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అరుల్ప్రకాష్ ఎస్, మెడికల్ ఆంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ సి.హెచ్. ధీరజ్, లాపరోస్కోపిక్ సర్జరీ నిపుణులైన డాక్టర్ ఆర్. వి.సుగి సుబ్రమణియం బృందం శుక్రవారం ప్రకటించింది. ఆమెకు అత్యంత అరుదైన ప్రాణాంతకమైన సమస్యలు ఉన్నట్లు గుర్తించినానంతరం, రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు గట్టిపడి, ఇరుకుగా మారే పరిస్థితి ఉండడంతో ప్లీహంను తొలగించాల్సి వచ్చిందని వివరించారు. లాపరోస్కోపిక్ విధానాన్ని ఉపయోగించడం వలన రోగికి పెద్దగా సర్జరీ గాయాలు లేకుండానే అంత పెద్ద అవయవాన్ని సురక్షితంగా తొలగించగలిగామన్నారు. ప్రస్తుతం రోగి వేగంగా కోలుకుంటున్నట్టు వవరించారు.


