● ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా చర్యలు
సాక్షి, చైన్నె : సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి రవాణా శాఖ అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకోసం జీపీఎస్, అత్యవసర బటన్ల వ్యవస్థను ముమ్మరం చేయాలని నిర్ణయించారు. పలు డివిజన్లుగా తమిళనాడు రవాణా సంస్థ బస్సుల సేవలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఇ ందులో ఎక్స్ ప్రెస్, సూదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులలో భద్రతా పరంగా చర్యలు విస్తృతం చేయడానికి నిర్ణయించారు.
నిరంతర పర్యవేక్షణ
కంట్రోల్ రూమ్ ద్వారా బస్సు ఎక్కడ ఉంది, ఎంత వేగంతో వెళ్తోంది, ఇంధన సగటు ఎంత వంటి వివరాలను నిరంతరం పర్యవేక్షించేందుకు సిద్ధమయ్యారు. బస్సులో ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా వివిధ చోట్ల ఎమర్జెన్సీ బటన్లను ఏర్పాటు చేస్తారు. ప్రమాదం లేదా ఆపద సమయాల్లో ఈ బటన్ నొక్కితే వెంటనే సహాయక బృందాలకు సమాచారం అందుతుంది.అత్యవసర సమయంలో బస్సు బయట ఉన్న వారికి సమాచారం అందించడానికి ’హూటర్ గన్’ అనే శబ్ద వ్యవస్థను కూడా అనుసంధానిస్తున్నారు. ఈ బస్సులు తమ ప్రయాణ చరిత్రను 180 రోజుల వరకు భద్రపరుస్తాయి. నిబంధనల ఉల్లంఘనలను ఈ వ్యవస్థ స్పష్టంగా గుర్తిస్తుంది. ఈ డేటాను రవాణా, పోలీస్ , అత్యవసర సేవా విభాగాలతో పంచుకోవడం ద్వారా సమగ్ర నిఘా సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వ ’వాహన్ పోర్టల్’కు కూడా అనుసంధానిస్తారు.


