మరోసారి మెగాఫోన్ పట్టనున్న ప్రదీప్ రంగనాథన్
తమిళసినిమా: రవి మోహన్ కథానాయకుడిగా నటించిన కోమాలి చిత్రంతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. ఆ వెంటనే కథానాయకుడు అవతారమెత్తారు. అలా స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా లవ్ టుడే అనే చిత్రం చేశారు. యూత్ ఫుల్ ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఆ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఆ తరువాత ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన డ్రాగన్ చిత్రం సంచలన విజయం అందుకుంది. అదేవిధంగా తాజాగా ఈయన హీరోగా నటించిన డ్యూడ్ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇలా దర్శకుడిగా, కథానాయకుడిగా అపజయం అంటూ ఎరగకుండా కేవలం నాలుగు చిత్రాలతోనే తనకంటూ ప్రత్యేక స్థానానికి చేరుకున్న ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. దీంతో ఈయన తదుపరి చిత్రం ఏమిటన్న ఆసక్తి నెలకొంది. కాగా ప్రదీప్ రంగనాథన్ మరోసారి మెగా ఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఈయన కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సారి ప్రదీప్ రంగనాథన్ సైన్స్ ఫిక్షన్ కథని తెరకెక్కించనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరో రెండు వారాల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


