మోతె : రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ మంగళవారం మోతె మండల కేంద్రంలో సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై రైతులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం శమటోడ్చి రైతులు పండించిన పంటను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తక్షణమే అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు అడుగడుగునా కష్టాలు పడుతున్నారన్నారు. అనంతరం మోతెలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కాంటాలు ఎందుకు కావడంలేదని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల వడ్లు కొంటున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది తప్ప ఆచరణలో పెట్టడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శీలం సైదులు, నాయకులు ఆరె లింగారెడ్డి, శంకర్నాయక్, మిక్కిలినేని సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్


