సూర్యాపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం రైతు పండించిన పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు ఏమాత్రం ప్రయోజన కరంగా లేవని, వాటిని సవరించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి. కోటేశ్వరరావు కోరారు. సూర్యాపేట పట్టణంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు పి. లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మద్దతు ధరలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లేవని అన్నారు. ముఖ్యంగా వరికి 72 రూపాయలు ప్రకటించడం సరైంది కాదన్నారు. వ్యవసాయానికి ఉపయోగించే ఎరువులు, వ్యవసాయ పనిముట్లపై పెద్ద ఎత్తున పెంచుతూ పంటలకు తక్కువ ధరలు ప్రకటించడం అంటే వ్యవసాయ రంగాన్ని మరింత దివాలా తీయించడం తప్ప మరొకటి కాదన్నారు. వరికి 2,441 అంటే 3.93శాతం, పత్తి6.2శాతం, మొక్కజొన్న 06శాతం పెరిగిందని అదే ఎరువులకు 18.50శాతం, వ్యవసాయ పనిముట్లకు 25శాతం రేట్లు పెంచిందన్నారు. ఈ విధంగా పెట్టుబడులకు పెద్ద ఎత్తున పెంచడం, మద్దతు ధరలు అతి తక్కువ పెంచడం సరైనది కాదన్నారు. సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, జిల్లా నాయకులు కాకి మోహన్ రెడ్డి, అహ్మద్ హుస్సేన్, అలుగుబెల్లి వెంకటరెడ్డి , కోట మధుసూదన్ రెడ్డి, మేకల కనకారావు, పి. నాగన్న పాల్గొన్నారు.


