పాడి రైతులకు భరోసా | - | Sakshi
Sakshi News home page

పాడి రైతులకు భరోసా

May 13 2026 5:02 AM | Updated on May 13 2026 5:02 AM

నార్ముల్‌కు పూర్వ వైభవం తెస్తాం

సాక్షి, యాదాద్రి : కొంతకాలంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నల్లగొండ – రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘానికి(నార్ముల్‌– మదర్‌ డెయిరీ) ఎట్టకేలకు మోక్షం లభించింది. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలో నార్ముల్‌ – మదర్‌డెయిరీ, ఎన్‌డీడీబీ మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరింది. తక్షణ సాయంగా రూ.27కోట్ల చెక్కును ఎన్‌డీడీబీ అందజేసింది. ఇందులో రూ. 10 కోట్లతో బుధవారం ఆరు నెలల పెండింగ్‌ పాల బిల్లులు చెల్లించనున్నారు.

సీఎం ఆదేశాలతో..

నార్ముల్‌– మదర్‌డెయిరీ పరిధిలో 50 వేల మంది రైతులు ఉన్నారు. 311 రిజిష్టర్‌ సొసైటీలు ఉన్నాయి. రోజూ 50 వేల లీటర్ల పాల సేకరణ చేస్తున్నారు. నార్ముల్‌ రూ.70కోట్ల అప్పుల్లో ఉంది. కష్టాల కడలిలో ఉన్న పాడిరైతులను గట్టెక్కించాలని ఎమ్మెల్యేలు సీఎంను కొంతకాలంగా కోరుతూ వచ్చారు. దీంతో స్పందించిన సీఎం ఎన్‌డీడీబీతో ఎంఓయూకు చర్యలు చేపట్టాలని పశు సంవర్ధక శాఖ మంత్రి, ఉన్నత స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు.ఈనెల 4న రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం కూడా తెలిపింది. మంగళవారం హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో ఉన్న పశు సంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, నార్ముల్‌ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, డైరెక్టర్ల సమక్షంలో మదర్‌డెయిరీ, ఎండీఎన్‌డీడీబీ ప్రతి నిధుల మధ్య ఒప్పందం కుదిరింది.

ఇక.. క్రమం తప్పకుండా బిల్లులు

ఒప్పందం ప్రకారం నార్ముల్‌ పాలసేకరణ చేస్తుంది. ఎన్‌డీడీబీ, ఢిల్లీ మదర్‌ డెయిరీలు పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌ చేస్తాయి. నార్ముల్‌ –మదర్‌డెయిరీ రోజూ లక్ష లీటర్లకుపైగా పాల సేకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైతులకు ప్రతి 15 రోజులకోసారి బిల్లులు చెల్లించాలని నిర్ణయించారు. నార్ముల్‌ కొనుగోలు చేసి ఇచ్చే ప్రతి లీటరు పాలకు ఎన్‌డీడీబీ రూ.6.50 కమీషన్‌ చెల్లిస్తుంది. ఈ ఆదాయంతో ఉద్యోగుల జీతాలు చెల్లించడంతో పాటు మెయింటెనెన్స్‌ చేస్తారు.

ముందుగా ఆరు నెలల బిల్లులు

పాడి రైతుల బిల్లులు చెల్లించేందుకు రూ. 10 కోట్ల చెక్కు, అప్పు చెల్లించేందుకు రూ. 17 కోట్ల చెక్కుతో కలిపి మొత్తం రూ. 27 కోట్లు నార్ముల్‌– మదర్‌ డెయిరీకి ఎన్‌డీడీబీ అందజేసింది. ముందుగా ఆరు నెలల పెండింగ్‌ పాల బిల్లులను బుధవారం చెల్లిస్తారు. అలాగే నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద ఉన్న నార్ముల్‌–మదర్‌ డెయిరీ భూమి 29.37 ఎకరాలను ఎన్‌డీడీబీ కొనుగోలు చేసి రూ. 40 కోట్లు చెల్లిస్తుంది. మరో రూ.28 కోట్లు సాఫ్ట్‌లోన్‌ ఇస్తుంది.

నార్ముల్‌–ఎన్‌డీడీబీ మధ్య కుదిరిన ఒప్పందం

ఫ రూ. 27 కోట్లు విడుదల

ఫ నేడు పాడి రైతులకు పెండింగ్‌ బిల్లుల

చెల్లింపులు

ఎన్‌డీడీబీతో నార్ముల్‌– మదర్‌ డెయిరీతో ఎంఓయూ కుందిరింది. ఒప్పందం కుదిరిన వెంటనే ఎన్‌డీడీబీ రూ.10 కోట్లు నార్ముల్‌ ఖాతాలో జమ చేసింది. ఈ డబ్బులను రైతుల పెండింగ్‌ పాల బిల్లులు చెలిస్తాం. నార్ముల్‌కు పూర్వ వైభవం తీసుకువస్తాం.

– గుడిపాటి మధుసూదన్‌రెడ్డి,

మదర్‌ డెయిరీ చైర్మన్‌

Advertisement
 
Advertisement
Advertisement