రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి

May 9 2026 7:32 AM | Updated on May 9 2026 7:32 AM

నడిగూడెం : రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. శుక్రవారం నడిగూడెం మండల కేంద్రంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఒక మాజీ ఐపీఎస్‌ భార్య హత్యకు గురైందని, శాంతి భద్రతలు గాడి తప్పాయనడానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. కరీంనగర్‌లో పట్టపగలే జ్యువెలరీ దుకాణంలో దొంగతనం జరిగిందని, ఈ ఘటనలో ఇంతవరకు దుండగులను పట్టుకోలేకపోయారన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులపై సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలను అదుపు చేయడంలో విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ మాట్లాడుతూ.. కోదాడలో జరిగిన దళిత యువకుడి లాకప్‌ డెత్‌, ఈ నెల 6న కోదాడలో భార్యను భర్త చంపడం శాంతి భద్రతల లోపాలకు నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి, మండల సమన్వయకర్త అనంతుల ఆంజనేయులు, భోనగిరి ఉపేందర్‌, జలీల్‌, కాసాని ఉపేందర్‌ పాల్గొన్నారు.

స్వేరోస్‌పై యువతకు అవగాహన కల్పించాలి

మోతె : స్వేరోస్‌పై విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించాలని స్వేరోస్‌ వ్యవస్థాపకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ఆయన మోతె మండల కేంద్రంలో స్వేరోస్‌ ముఖ్య కార్యకర్తలతో మాట్లాడారు.అనంతరం స్వేరోస్‌ సూర్యాపేట జిల్లా కోశాధికారి జిల్లపల్లి శివకృష్ణ–దీపిక దంపతుల కుమార్తెకు నామకరణం చేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో స్వేరోస్‌ ఇంటర్నేషనల్‌ చీఫ్‌ కన్వీనర్‌ బల్గూరి దుర్గయ్య, స్వేరోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు చిలకపత్దిని వీరయ్య, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొల్లికొండ వీరాస్వామి, నిర్మల, రవికుమార్‌, మండల అధ్యక్షుడు దున్నపోతులు దుర్గారావు పాల్గొన్నారు.

భీమ్‌ హోం నిర్మిస్తాం

చిలుకూరు : ఇటీవల మృతి చెందిన చిలుకూరు గ్రామానికి చెందిన స్వేరోస్‌ నాయకుడు గురువయ్య కుటుంబానికి స్వేరోస్‌ ఆధ్వర్యంలో భీమ్‌ హోం నిర్మించి ఇస్తామని స్వేరోస్‌ వ్యవస్థాపకుడు, బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. చిలుకూరులోని జేజే నగర్‌లో ఇటీవల మృతి చెందిన స్వేరోస్‌ నాయకుడు కందుకూరి గురువయ్య కుటుంబాన్ని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ శుక్రవారం పరామర్శించారు. గురువయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువయ్య పిల్లల బాధ్యతను స్వేరోస్‌ చూసుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొల్లికొండ వీరస్వామి, కందుకూరి ఉపేందర్‌, ముదిగొండ చిరంజీవి పాల్గొన్నారు.

ఫ బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement