హుజూర్నగర్ : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. గురువారం హుజూర్నగర్కు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా బీజేపీ విజయపథంలో దూసుకుపోతుందన్నారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో ప్రజలు బీజేపీకి భారీ మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారని తెలిపారు. దాంతో పాటు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్పారు. సభను విజయవంతం చేయడానికి జిల్లా నలుమూలల నుంచి యువత, మహిళలు, రైతులు, మేథావులు, కార్మికులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీలత, పట్టణ అధ్యక్షులు కొండ హరీష్, నాయకులు మల్సూర్, కె కోటిరెడ్డి, చంద్రయ్య, శ్రీనివాస్, విజయ్, నాగరాజు, బల్వంత్ సింగ్, రామారావు, పృథ్వి పాల్గొన్నారు.


