భానుపురి (సూర్యాపేట) : సాదా బైనామాల పరిష్కారానికి అనేక ఏళ్లుగా దరఖాస్తు దారులు ఎదురు చూస్తున్నారు. అనేక చిక్కుముడులు, అడ్డంకులతో వీటికి మోక్షం కలగడం లేదు. దాంతో కాగితాలపై రాసుకుని భూములు కొనుగోలు చేసిన రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం సాదాబైనామాల పరిష్కారానికి వేసిన ముందడుగు రైతుకు కాస్త ఊరట కలిగిస్తోంది. తమ సమస్య పరిష్కారానికి అడ్డంకులు తొలగినట్లేనని వారు భావిస్తున్నారు. ఇదే జరిగితే జిల్లాలో పెద్ద ఎత్తున భూ సమస్యలు తీరనున్నాయి.
కాగితంపై రాసుకొని కొనుగోళ్లు..
గ్రామీణ ప్రాంతాల్లో పూర్వం చాలా వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేదు. కేవలం అమ్మిన, కొనుగోలు చేసిన రైతులు గ్రామ పెద్దల సమక్షంలో తెల్లకాగితాలపై రాసుకొనే భూములు విక్రయించే వారు. ఆ తరువాత వ్యవసాయ భూములకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం ప్రారంభించడం, రుణాలు మాఫీ అవుతుండడంతో చాలామంది రైతులు భూముల రిజిస్ట్రేషన్ల వైపు మళ్లారు. మరి కొందరు రిజిస్ట్రేషన్ల కోసం డబ్బులు వెచ్చించాల్సి రావడంతో, ఆ మొత్తం వారి వద్ద లేకపోవడంతో అలాగే వదిలేశారు. ఈ క్రమంలోనే రైతుబంధు, రైతుభరోసా పథకాలు రావడంతో భూముల పంచాయతీలు మొదలయ్యాయి. 2020 అక్టోబర్లో ప్రభుత్వం ఈ సాదాబైనామా కింద భూములు కొనుగోలు చేసిన రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దాంతో సూర్యాపేట జిల్లాలో 29,814 దరఖాస్తులు వచ్చాయి.
కొత్త చట్టం వచ్చినా..
సాదాబైనామాల దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునే సమయంలో పలు కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయింది. కొంత కాలానికి కోర్టు చిక్కులు తొలిగిపోగా.. కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కరించేందుకు కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంలో పేర్కొన్న ఇరుపక్షాల అంగీకారం నిబంధనతో వాటిని పరిష్కరించే పరిస్థితి లేకుండా పోయింది. తాజాగా ఈ నిబంధనలో ప్రభుత్వం మార్పు చేసింది. కొనుగోలుదారు అందించే హామీ పత్రం (అఫిడవిట్)తో పరిష్కారం చూపాలని నిర్ణయించారు.
ఫ సాదా బైనామాల పరిష్కారంలో అనేక చిక్కుముడులు
ఫ దరఖాస్తులకు నేటికీ కలుగని మోక్షం
ఫ జీఓలో సవరణతో దరఖాస్తుదారుల్లో చిగురిస్తున్న ఆశలు


