ఫ ఎస్పీ నరసింహ
సూర్యాపేట : మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ నరసింహ అన్నారు. ‘అరైవ్– అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సూర్యాపేట ట్రాఫిక్ పోలీసులు, పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుంచి కుడకుడ రోడ్డు వరకు స్థానిక ప్రజలకు, ఆటో, టాక్సీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చాలన్నారు. వాహనాలు నడుపుతున్న సమయంలో రోడ్డుపై ఉన్న పరిస్థితులను అంచనా వేస్తూ, కాలినడకన వెళ్లే వారిని గమనిస్తూ ముందుకు సాగాలని సూచించారు. టాక్సీ, ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని, వాహనానికి సంబంధించి అనుమతి పత్రాలు వెంట ఉండాలన్నారు. వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, డ్రైవర్ పక్కన ప్రయాణికులను కూర్చోబెట్టుకో వద్దని సూచించారు. పెద్ద వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోవడం సురక్షితమని, నిదానంగా వాహనాలను నడుపుతూ సురక్షితంగా గమ్యం చేరాలన్నారు. కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, పట్టణ ఎస్ఐలు ఏడుకొండలు, ఐలయ్య పాల్గొన్నారు.


