యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహాశివుడికి ఇష్టమైన రోజు కావడంతో అర్చకులు విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలను జరిపించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు జరిపి, భక్తులచే అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. అదేవిధంగా యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కైంకర్యాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా జరిపించారు.


