సూర్యాపేటటౌన్ : అతి కొద్దిమంది ధనవంతుల కోసం విదేశీ విద్యాలయాలను ఆహ్వానించడం కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల పేద విద్యార్థులకు నాణ్యమైన సమానమైన విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై దృష్టి సాధించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.సోమయ్య డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ భవన్లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే ఆకర్షణీయమైన పేర్లతో ప్రభుత్వ రంగంలో నాణ్యమైన విద్యను కొందరికే పరిమితం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో విదేశీ పాఠశాలల ఏర్పాటు కోసం ఆయా యాజమాన్యాలతో ప్రభుత్వ అధికారులు చర్చలు జరిపి ఆహ్వానించడం విస్మయం కలిగిస్తోందని తెలిపారు. టీఎస్ యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.రాములు మాట్లాడుతూ జీవో 25ను సవరించి ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు, 50 మంది విద్యార్థులు దాటిన ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడి పోస్టు, తరగతికొక టీచర్ను నియమించాలని సూచించారు. ఈ సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ జె.యాకయ్య, పి.శ్రీనివాసరెడ్డి, కె.అరుణ భారతి, జి. వెంకటయ్య ఆర్.దామోదర్, ఎన్.నాగేశ్వరరావు పాల్గొన్నారు.


