దేవరకొండ: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యవసాయ కూలీ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్ప డిన సంఘటన దేవరకొండ మండలం తాటికోల్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హన్మంతు తిరుపతి(45) గ్రామంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబంతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. తిరుపతి కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. శుక్రవారం ఎప్పటిలాగానే పొలం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే గల ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన చుట్టుపక్కల వారు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.
పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
తిప్పర్తి: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన తిప్పర్తి మండలంలోని గడ్డికొండారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వీరమళ్ల చంద్రయ్య(55) ఓ వ్యక్తికి సంబంధించిన తోటలో కాపలాగా పనిచేస్తున్నాడు. శుక్రవారం తోటలో పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. పడిపోయి ఉండడంతో కుటుంబసభ్యులు గమనించి 108కు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం చంద్రయ్యను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.
మహిళ అదృశ్యం
నల్లగొండ: నల్లగొండలోని అన్సారీ కాలనీకి చెందిన వివాహిత అదృశ్యమైంది. ఈమేరకు కుటుంబసభ్యులు శుక్రవారం నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అన్సారీ కాలనీకి చెందిన బోధ (45) తాను నందిగామకు వెళ్తున్నానని తన కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లింది. కుటుంబ సభ్యులు ఆరా తీయగా ఆమె నందిగామకు చేరుకోలేదని తెలిసింది. ఈమేరకు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బోధ ఆచూకీ తెలిసిన వారు టూటౌన్ ఎస్ఐ 87126 70176కు ఫోన్ చేయాలని పోలీసులు తెలిపారు.


