అక్రమాలకు తావులేకుండా..
పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తాం
సూర్యాపేట టౌన్ : ఇంటర్ విద్యార్థుల ప్రయోగ పరీక్షలను ఈ ఏడాది పూర్తిస్థాయి నిఘా వ్యవస్థలో నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడంతో పాటు అక్రమాలకు తావులేకుండా చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ గదికి అనుసంధానించారు. ఈ ఏడాది నిఘా వ్యవస్థకు అనుసంధానమైన కళాశాలలకే ఇంటర్ ప్రయోగ పరీక్ష కేంద్రాలను కేటాయించారు. సీసీ కెమెరాలు లేని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను సమీపంలోని నిఘా వ్యవస్థ ఉన్న కళాశాలలకు తరలిస్తారు. ఒక్కో కళాశాలకు 16 నుంచి 20 వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
86 జూనియర్ కళాశాలలు..
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి 86 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఎనిమిది, ప్రైవేట్ కళాశాలలు 30, మోడల్ స్కూల్స్ తొమ్మిది, సోషల్ వెల్ఫేర్ ఎనిమిది, బీసీ వెల్ఫేర్ ఎనిమిది, కేజీబీవీలు 15, మైనార్టీ వెల్ఫేర్ నాలుగు, ట్రైబల్ వెల్ఫేర్ మూడు, రెసిడెన్షియల్ ఒకటి చొప్పున ఉన్నాయి. వీటిల్లో ఫస్టియర్ విద్యార్థులు 8,500 మంది, సెకండియర్ విద్యార్థులు 8వేల మంది ఉన్నారు.
ప్రయోగ పరీక్షల సెంటర్లు ఇలా..
జిల్లాలో మొత్తం 86 జూనియర్ కళాశాలలు ఉండగా అందులో 41 కళాశాలల్లో సీసీ కెమెరాలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు వాటిలో సెంటర్లను ఏర్పాటు చేశారు. 26 జనరల్ విద్యార్థులకు, 15 ఒకేషనల్ విద్యార్థులకు సెంటర్లను కేటాయించారు. ఈ సెంటర్లలో కచ్చితంగా సీసీ కెమెరాలు ఉండనున్నాయి. గతంలో 50 మంది విద్యార్థులున్న కళాశాలకు ప్రాక్టికల్స్ సెంటర్లను కేటాయించారు. ఈ ఏడాది సీసీ కెమెరాలు ఉన్న కళాశాలలకు మాత్రమే పరీక్ష కేంద్రాలు కేటాయించారు. సీసీ కెమెరాల నీడలో ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలను అధికారులు ఓపెన్, సీల్ చేయనున్నారు. జిల్లాలో 8వేల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రాక్టికల్స్ పరీక్ష రాయనున్నారు.
ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రాక్టికల్స్
ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. అయితే ఇప్పటికే కళాశాలల్లో సిలబస్ పూర్తిచేసి రివిజన్ చేస్తున్నారు. అలాగే ద్వితీయ సంవత్సరం విద్యార్థులను ప్రాక్టికల్స్ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. మొత్తం మూడు దశల్లో ప్రాక్టికల్స్ జరగనున్నాయి.
ఈ ఏడాది ఇంటర్ ప్రాక్టికల్స్ పకడ్బందీగా నిర్వహిస్తాం. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు ఉన్న కళాశాలలే సెంటర్లుగా గుర్తించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 41 సెంటర్లను ఏర్పాటు చేశాం.
– భానునాయక్, డీఐఈఓ
ఫ సీసీ నిఘాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్కు సన్నాహాలు
ఫ కొత్త నిబంధన తెచ్చిన ఇంటర్ బోర్డు
ఫ జిల్లాలో 41 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
ఫ పరీక్షలకు హాజరుకానున్న
8 వేల మంది విద్యార్థులు
అక్రమాలకు తావులేకుండా..


