ఇక రైతు ఉత్పత్తిదారుల సంఘాలు | - | Sakshi
Sakshi News home page

ఇక రైతు ఉత్పత్తిదారుల సంఘాలు

Jul 17 2025 3:46 AM | Updated on Jul 17 2025 3:46 AM

ఇక రై

ఇక రైతు ఉత్పత్తిదారుల సంఘాలు

భానుపురి (సూర్యాపేట) : ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్‌) ఇకనుంచి రైతుఉత్పత్తి దారుల సంఘాలుగా సేవలు అందించనున్నాయి. ఇప్పటివరకు రైతులకు వ్యవసాయ రుణాలు, వడ్ల కొనుగోలు, ఎరువులు, విత్తనాలను మాత్రమే అందించిన ఈ కేంద్రాలు మరిన్ని సేవలను అందించనున్నాయి. కేంద్ర సహకార శాఖ పీఏసీఎస్‌లను రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా మారుస్తుండగా.. మొదటి విడతలో ఉమ్మడి జిల్లా నుంచి 39 సెంటర్లను ఎంపిక చేశారు. గుర్తించిన ఎఫ్‌పీఓలకు ఒక్కోదానికి రూ.18 లక్షల చొప్పున నిధులు సైతం మంజూరు చేశారు.

సూర్యాపేటలో 9 పీఏసీఎస్‌ల గుర్తింపు

రాష్ట్రవ్యాప్తంగా 311 పీఏసీఎస్‌లను రైతు ఉత్పత్తిదారుల సంఘాలను (ఎఫ్‌పీఓ) కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 107 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉండగా వీటిలో నుంచి 39 పీఏసీఎస్‌లకు మొదటి విడతలో స్థానం దక్కింది. ఇందులో సూర్యాపేట జిల్లా నుంచి చివ్వెంల పీఏసీఎస్‌తో పాటు నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి, పెన్‌పహాడ్‌ మండలం నారాయణగూడెం, చిలుకూరు, గరిడేపల్లి మండలం పొనుగోడు, మేళ్లచెర్వు, నడిగూడెం, పాలకీడు, సూర్యాపేట పీఏసీఎస్‌లు మొత్తం 9 రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా మొదటి విడతలో ఎంపికయ్యాయి. అదేవిధంగా నల్లగొండ జిల్లాలో 13సెంటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 సెంటర్లను ఎంపిక చేశారు. కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వీటిని మొదటి విడతలో గుర్తించింది.

మరిన్ని సేవలు..

రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో ప్రస్తుతం పీఏసీఎస్‌ల్లో అందుతున్న సేవలతో పాటు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. రైతులకు రుణాలే కాకుండా కూరగాయలు, పండ్ల సాగును ప్రోత్సహించనున్నారు. సేంద్రియ వ్యవసాయానికి అవసరమైన ఎరువులను సంఘాల్లో అందుబాటులోకి తేనున్నారు. వ్యవసాయ యంత్ర పరికరాలు, కోల్డ్‌ స్టోరేజీల యూనిట్లు, కోళ్ల పెంపకం చేపట్టనున్నారు. దీంతో ఓ వైపు రైతులకు అన్ని రకాల సేవలు అందడంతో పాటు సంఘాలు ఆర్థికంగా బలోపేతం కానున్నాయి.

ఫ పీఏసీఎస్‌లను అప్‌గ్రేడ్‌ చేసిన ప్రభుత్వం

ఫ మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలో

39 సెంటర్లు ఎంపిక

ఫ నిర్వహణ నిధులు సైతం విడుదల

రైతులకు మేలు కలుగుతుంది

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పడ్డాయి. వీటితో రైతులకు మేలు జరుగుతోంది. చాలా రకాల సేవలు ఈ సంఘాలతో అందుతాయి. మొదటి విడతగా సూర్యాపేట జిల్లాలో 9 పీఏసీఎస్‌లను గుర్తించారు. నేరేడుచర్ల మండలం చిల్లేపల్లికి ఇందుకు సంబంధించిన పత్రాలను అందజేశారు. త్వరలోనే అన్ని పీఏసీఎస్‌లు ఇదే విధంగా సేవలు అందిస్తాయి.

– పద్మ, డీసీఓ

మొత్తం పీఏసీఎస్‌లు, ఎంపికై న రైతు

ఉత్పత్తి సంఘాల వివరాలు

పీఏసీఎస్‌లు గుర్తించినవి

సూర్యాపేట 44 9

నల్లగొండ 42 13

భువనగిరి 21 17

మొత్తం 107 39

ఇక రైతు ఉత్పత్తిదారుల సంఘాలు1
1/1

ఇక రైతు ఉత్పత్తిదారుల సంఘాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement