
నిరంతరం.. నిఘా!
పారదర్శకత కోసమే సీసీ కెమెరాలు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తరగతుల నిర్వహణలో పారదర్శకత కోసమే ప్రభుత్వం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. రోజు వారీగా కళాశాలలకు ఎంత మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అధ్యాపకులు బోధన ఎలా చేస్తున్నారు. అనే విషయాలపై నిఘా ఉంటుంది. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉండే కమాండ్ కంట్రోల్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. దీంతో హాజరు శాతం, బోధన మెరుగుపడనుంది.
– భానునాయక్, డీఐఈఓ, సూర్యాపేట
హుజూర్నగర్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలలపై నిరంతరం నిఘా పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కళాశాలల్లో ఏటా విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నప్పటికీ ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. రోజువారీగా విద్యార్థులు తక్కువగా వస్తున్నా అధ్యాపకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించారు. ఫలితంగా ప్రైవేట్ కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధిస్తుండగా.. ప్రభుత్వ కళాశాలలు వెనుకబడుతున్నాయి. దీంతో విద్యార్థులు హాజరు, ఉత్తీర్ణత శాతం పెంపుపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నారు.
అధికారులకు క్షణాల్లో తెలిసేలా..
ఇప్పటి వరకు ఇంటర్ వార్షిక పరీక్షల సమయంలో ఆయా కేంద్రాల్లో నిర్వహణ సజావుగా సాగేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేవారు. ఇక నుంచి ప్రతి ప్రభుత్వ కళాశాలలో నిరంతరం ఇవి ఉండేలా చర్యలు ప్రారంభించారు. ప్రతి విద్యార్థితోపాటు ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఏమి చేస్తున్నారో కూడా ఇంటర్మీడియట్ అధికారులకు క్షణాల్లో తెలిసేలా సీసీ కెమెరాలను ఇంటర్ బోర్డుకు అనుసంధానం చేస్తున్నారు. కళాశాలల్లో ప్రతి తరగతి గది, వరండాలు, ప్రయోగశాల, ఆరుబయట తదితర ప్రదేశాల్లో సీసీ కెమెరాలను అమర్చనున్నారు. తరగతి గదులకు అనుగుణంగా 12 నుంచి 14 కెమెరాలను అమర్చనున్నారు. విద్యార్థుల హాజరు శాతం తగ్గినా ఇంటర్ బోర్డుకు ఇట్టే తెలిసిపోనుంది.
మొత్తం విద్యార్థులు 3,003 మంది
జిల్లాలో సూర్యాపేట, నడిగూడెం, తుంగతుర్తి, కోదాడ, నేరేడుచర్ల, హుజూర్నగర్, నెమ్మికల్, తిరుమలగిరితో కలిపి మొత్తం ఎనిమిది జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 3,003 విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం 1,559 మంది ఉండగా రెండో సంవత్సరంలో 1,444 మంది విద్యార్థులు చదువుతున్నారు.
కమాండ్ కంట్రోల్ సిస్టం ద్వారా పర్యవేక్షణ
కళాశాలల్లో రోజు వారీ విద్యార్థుల హాజరు, బోధన తీరు, కళాశాలల నిర్వహణ తదితర అంశాలను బో ర్డు అధికారులు ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సిస్టం ద్వారా పర్యవేక్షించనున్నారు. ప్రిన్సిపాల్ హోదా కలిగిన అధికారి ఆధ్వర్యంలో జిల్లాల వారీగా కళాశాలలను పరిశీలిస్తారు. దీంతో ప్రతి సమాచారం బోర్డు అధికారులకు తక్షణం తెలుస్తుంది. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఇంటర్ బోర్డు నుంచి సంబంధిత ప్రిన్సిపాళ్లకు సమాచారం వస్తుంది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాలు
ఫ విద్యార్థుల హాజరు
శాతం పెంచేలా చర్యలు
ఫ అధ్యాపకుల పనితీరుపైనా దృష్టి
ఫ పారదర్శకత కోసమే ఏర్పాటు చేస్తున్న ఇంటర్ బోర్డు

నిరంతరం.. నిఘా!