ఖమ్మం సహకారనగర్ : తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎండీ జహంగీర్ అలీ ఎన్నికయ్యారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికలకు ఎన్నికల అధికారిగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ హిలావత్ అంజియా వ్యవహరించారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఎండీ. జహంగీర్ అలీ, సంగారెడ్డి జిల్లాకు చెందిన మల్లేష్గౌడ్, ఖమ్మం నుంచి కె. వెంకటేశ్వర్లు అధ్యక్ష స్థానానికి నామినేషనన్లు దాఖలు చేశారు. చివరకు వెంకటేశ్వర్లు, మల్లేష్ నామినేషన్లు ఉపసంహరించుకోగా.. జహంగీర్ అలీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. కాగా, సోమవారం ఖమ్మంలోని డ్రైవర్ల సంఘం భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు సంఘంలో గతంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎండీ సలీం, దాసరి వేణు, లింగంపల్లి గంగన్న, జి. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


