
మఠంపల్లి : పంచాంగ పఠనంలో పాల్గొన్న భక్తులు
● పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు
● పంచాంగ పఠనం చేసిన అర్చకులు
● గ్రామాల్లో ఉగాది పచ్చడిని పంపిణీ చేసిన నాయకులు
మునగాల : మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తమ ఇళ్లల్లో ఉగాది పచ్చడిని తయారు చేసుకొని బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి జనసంఘం ఆధ్వర్యంలో స్థానిక శ్రీవెంకటకనకదుర్గ దేవాలయంలో పూజారులు వారణాసి వెంకటరమణశాస్త్రి, వారణాసి మధుశర్మల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రం శివారులో గల శ్రీహరిహరసుత అయ్యప్ప దేవాలయంలో అర్చకుడు నరపనేని రామారావు పంచాంగ శ్రవణం నిర్వహించారు. అదేవిధంగా రామాలయంలో పూజారులు పంచాంగ శ్రవణం వినిపించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, రెడ్డి జనసంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
చిలుకూరు : మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో బుధవారం ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం దేవాలయాల్లో ఆలయ పూజారులు పంచాంగ శ్రవణం చదివి వినిపించారు.
నేరేడుచర్ల : ఉగాది పర్వదినాన్ని మండల ప్రజలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకొని ఉగాది పచ్చడి చేసి పచ్చడను స్వీకరించి ఒకరికొకరూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం సాయంత్రం దేవాలయాలలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాల్లో నేరేడుచర్ల శివాలయం ఆలయ కమిటీ చైర్మన్ రాచకొండ రామకోటేశ్వర్రావు, సోమప్ప దేవాలయ కమిటీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్రావు, ఆకారపు వెంకటేశ్వర్లు, వెంకటరమణారావు భక్తులు తదితరులున్నారు.
హుజూర్నగర్ : శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలను పట్టణంలోని పలు ఆలయాల్లో బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో పూజారులు ప్రత్యేక పూజలు చేసి ఉగాది పచ్చడి, తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం ఆలయాల ప్రాంగణంలో పంచాంగ శ్రవణం గావించారు. కార్యక్రమాల్లో ఆయా ఆలయాల కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
హుజూర్నగర్రూరల్ : మండలంలోని బూరుగడ్డలో గల శ్రీ ఆదివరహ లక్ష్మీనర్సింహ వేణుగోపాలస్వామి దేవాలయంలో శ్రీ శోభకృత్ తెలుగు నామ సంవత్సర ఉగాది వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతసేవ, ఆరాధన, అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, సేవాకాలం, అలంకరణ, మంగళశాసనం, కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 4గంటలకు పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, సర్పంచ్ షేక్ సలీమారంజాన్, ఉపసర్పంచ్ శీలం ఆదేమ్మ, మాజీ సర్పంచ్ అరుణ్కుమార్ దేశ్ముఖ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్చైర్మన్ గువ్వల వీరయ్య, షేక్ అలీపాషా, ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎంపీ లక్ష్మణరావు, అర్చకులు హరీష్కుమార్ చార్యులు, లింగయ్య, కిరణ్గౌడ్, భక్తులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
గరిడేపల్లి : మండలంలోని అన్ని గ్రామాల్లో ఉగాది పండుగను భక్తిశ్రద్ధలతో బుధవారం ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గరిడేపల్లి, పొనుగోడు, కితవారిగూడెం, గడ్డిపల్లిలోని శివాలయాలు, రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో పూజారులు, కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు, మహిళలు తదితరులున్నారు.
కోదాడరూరల్ : మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఉగాది వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో ప్రజలు పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు పంచాంగ శ్రవణం వినిపించారు.
నడిగూడెం : మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో బుధవారం ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే నడిగూడెం, సిరిపురం శ్రీ కోదండరామస్వామి ఆలయాల్లో పంచాంగం శ్రవణం చదివి వినిపించారు. కార్యక్రమంలో ఆలయాల ప్రఽ ధాన అర్చకులు ఎస్బీ.వరదాచార్యులు, వేదాంతం చక్రథరాచార్యులు, నడిగూడెం ఆలయ కమిటీ అధ్యక్షుడు భౌరిశెట్టి వెంకటరత్నం, భక్తులు పాల్గొన్నారు.
మేళ్లచెరువు : మండలంలోని ఆయా గ్రామాల్లో శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయాలతో పాటు ప్రజలు తమ ఇళ్లలో పూజలు నిర్వహించారు. సాయంత్రం దేవాలయాల్లో నిర్వహించిన పంచాంగ శ్రవణాన్ని విన్నారు.
మఠంపల్లి : మండల కేంద్రంలోని కనకదుర్గా దేవాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా చౌటపల్లిలోని శ్రీవేణుగోపాలస్వామి దేవాలయంలో, బక్కమంతులగూడెం రామాలయంలో, రఘునాథపాలెంలోని కోదండరామస్వామి దేవాలయంలో, యాతవాకిల్ల, అల్లీపురం వరదాపురం, గుండ్లపల్లి, పెదవీడు తదితర గ్రామాల్లోని ఆలయాలలో పంచాంగ శ్రవణం పఠనం గావించారు. కార్యక్రమంలో సర్పంచ్ మన్నెం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీలు కొండానాయక్, కె.లక్ష్మీవెంకటనారాయణ, మల్లికంటి బుచ్చయ్య, రవీందర్, లక్ష్మారెడ్డి తదితరులున్నారు.
మోతె : మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఉగాది పండగను ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఇంటికి మామిడి ఆకుల తోరణాలతో అలంకరించి షడ్ రుచులతో తేనీటి పానకం తయారు చేసి ఇంటిల్లిపాది స్వీకరించారు.

నడిగూడెంలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో పంచాంగ శ్రవణంలో పాల్గొన్న భక్తులు

నేరేడుచర్ల శివాలయంలో పంచాంగ పఠనం నిర్వహిస్తున్న పురోహితుడు వెంకటేశ్వరశాసి్త్ర

మునగాల రామాలయంలో పంచాంగ పఠనం చేస్తున్న పురోహితుడు