● పాతటెక్కలి భారీ చోరీ ఘటనలో దొరికిన కీలక నిందితుడు
● మరో ఇద్దరు పాత నేరస్తులతో కలసి పథక రచన
● ముగ్గురిదీ ఒడిశానే– పోలీసుల అదుపులో నిందితులు
శ్రీకాకుళం క్రైమ్ :
జిల్లాలో ఇటీవలి కాలంలో భారీ చోరీలతో రెచ్చిపోయిన ఒడిశా చోరులు జిల్లా పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు ఇప్పటికే వారినుంచి పూర్తి స్థాయి లో సొత్తును స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే..
పాత టెక్కలి కేసే పట్టించింది
పాతటెక్కలిలో చిన్న టిఫిన్ కొట్టు నడుపుతూ ఇద్దరు కుమార్తెలు, భార్యతో కలసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న మళ్లా భూపతి ఈ నెల 5 రాత్రి 7.30 గంటలకు కుటుంబంతో కలసి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లాడు. తిరిగి 7న వచ్చి చూసేసరికి తాళాలు బద్దలు గొట్టి ఇంట్లో దొంగలు ప్రవేశించి బీరువాలో ఉన్న బంగారు వస్తువులు 10 తులాలు, వెండి వస్తువులు కిలోన్నర, రూ. 4 లక్షల నగదు చోరీ చేశారు. వెంటనే వజ్రపుకొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అడిషనల్ ఎస్పీ (క్రైమ్) పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలోని బృందాలుగా విడిపోయిన పోలీసులు నిందితులను అనతికాలంలోనే పట్టుకున్నారు.
బంధం కలిపాడు.. ఇంటికి కన్నమేశాడు
బాధితుడైన భూపతిని పోలీసులు ఎవరిౖపైనెనా అనుమానం ఉందా అని అడుగగా.. ఒడిశా పర్లాఖిముండి కాంప్లెక్స్ ఎదురుగా టిఫిన్షాపు నడుపుతున్న తన పెద్దమ్మ మనవడు పొట్నూరు మిన్నాపైన అనుమానం ఉందన్నాడు. మిన్నా ఈ ఏడాది ఏప్రిల్ 30న అతని సోదరుని పెళ్లికి వెళ్లేటప్పుడు పరిచయమయ్యాడని, ఆ రోజే తన భార్య ఒంటిపై బంగారం చూశాడని, రెండు నెలల క్రితం ఇంటికొచ్చాడని, అప్పుడప్పుడూ ఫోన్లో కుటుంబసభ్యులతో మాట్లాడేవాడని, ఆ క్రమంలోనే చోరీకి 3 రోజుల ముందు తమ కుమార్తెతో మాట్లాడి విజయవాడ వెళ్తున్నట్లు తెలుసుకున్నాడన్నారు. ఒకానొ క సందర్భంలో మిన్నా సోదరుడు సైతం మిన్నాతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడని భూపతి తెలిపారు. దీంతో పోలీసులు మిన్నాను అదుపులోకి తీసుకుని విచారించగా ఇద్దరు పాత నేరస్తులతో కలసి చోరీకి పథక రచన చేసినట్లు చెప్పాడు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయగా 4 నెలల కిందట మెళియాపుట్టిలోని 12 తులాల బంగారం కేసుతో పాటు మరో 3 నాన్ గ్రేవ్ కేసుల్లో హస్తముందని తెలిసింది. వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని సొత్తు పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి కేసులకు సంబంధించి సొత్తు పూర్తిగా రికవరీ అయినట్లు సమాచారం.
పాతటెక్కలి చోరీ కేసులో
పోలీసులు రికవరీ చేసినవి..
నల్లపూసలు 2.5 తులాలు, బిస్కెట్లు 2 తులాలు, గొలుసు తులం, చిన్నబిల్ల వున్న గొలుసు తులం, పట్టీలు 4 జతలు (వెండివి), ఉంగరాలు –2 (తులం), చిన్న ఉంగరం వెండి వస్తువులు కేజీన్నర 3 రకాలు, క్యాష్ రూ. 4 లక్షలు


