సంతబొమ్మాళి: మండలంలోని దండుగోపాలపురంలో పబ్లిక్ ప్లే గ్రౌండ్ ఆక్రమణకు కూటమి నాయకులు శుక్రవారం దౌర్జన్యం చేశారు. వి వరాల్లోకి వెళితే.. దండుగోపాలపురంలో పబ్లిక్ ప్లే గ్రౌండ్ కోసం గ్రామస్తులందరూ కొంత స్థలాన్ని ఇచ్చారు. ఆ స్థలంలో గ్రంథాలయం, ఆటస్థలం, కళామందిర్ ఏర్పాటు చేశారు. ఆ స్థలం చుట్టూ 1998లో ప్రహరీ నిర్మాణానికి పంచాయతీ అనుమతి ఇవ్వడంతో నిర్మాణం చేపట్టారు. ఈ స్థలంపై స్థానిక అధికార పార్టీ నాయకుల కన్నుపడింది. లీజు దస్తా ఒప్పందం పత్రాలను సృష్టించి స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. దీంతో గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు ఉన్నప్పటికీ శుక్రవారం కూటమి నాయకులు 20మందితో మారణాయుధాలతో వచ్చి ప్రహరీని కూల్చి సిమెంట్ బెంచీలను విరగ్గొట్టారు. ఇదేమిటని ప్రశ్నించిన కొందరు గ్రామస్తులపై దాడికి ప్ర యత్నించారు. అడ్డుకుంటే కేసులు పెడతామని బెదిరించారు. ఫిర్యాదు చేస్తే కేసులు తప్పవని హెచ్చరించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అయితే ఈ తతంగమంతా పోలీసుల సమక్షంలో జరగడం కొసమెరుపు.


