సరిచేసుకోవాలి
● గ్యాస్ ఎవరి పేరుమీదో ఉందో సరిచూసుకోవాలి ● మృతుల పేరుతో జిల్లాలో 14 వేల కనెక్షన్లు ● ఈకేవైసీ చేయించుకోని వారు 10 వేల మంది ●కఠిన ఆంక్షలు పెడితే సరఫరా నిలిచిపోయే ప్రమాదం
హిరమండలం: గ్యాస్ వినియోగదాలకు కీలక సూచన. గ్యాస్ సిలిండర్ ఎవరి పేరు మీద ఉందో స్పష్టంగా చూసుకోండి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. జిల్లాలో చాలా గ్యాస్ కనెక్షన్లు మృతుల పేరుతోనే ఉన్నాయి. దాదాపు ఇలా 14 వేల కనెక్షన్లు ఉన్నట్టు తెలుస్తోంది. మరో 10 వేల మంది వినియోగదారులు ఈకేవైసీ కూడా చేయించుకోలేదు. అయితే ప్రస్తుతం పశ్చిమా ఆసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్పై అనేక ఆంక్షలు ఉన్నాయి. ఈ తరుణంలో మృతుల పేరుతో కనెక్షన్లు, ఈకేవైసీ చేయించుకోని వారి కనెక్షన్లను తొలగించే అవకాశముంది. ఈ విషయంలో గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. మృతుడి సంబంధిత వివరాలు, కుటుంబ అనుబంధ ఫొటోలు, ఇతర ధ్రువపత్రాలతో వెళ్తే కుటుంబ సభ్యుల పేరుతో మార్చే అవకాశం ఉంది. జిల్లాలో హెచ్పీసీఎల్, భారత్, ఇండేన్ గ్యాస్ వినియోగదారులు అధికం. ప్రస్తుతం ఓటీపీ ఆధారిత సేవలు మాత్రమే అందుతున్నాయి. అందుకే ఏక్షణం అయినా కేంద్ర ప్రభుత్వం మృతుల పేరుతో ఉన్న గ్యాస్ కనెక్షన్లు, ఈకేవైసీపీ పూర్తిచేయని వారి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందువలన సరైన ధ్రువపత్రాలు జతచేసి సరిచేసుకోవాలని గ్యాస్ ఏజెన్సీ సంస్థలు సూచిస్తున్నాయి.
మృతుల పేరుతో ఉండే గ్యాస్ కనెక్షన్లు రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఈకేవైసీ చేయించకపోయినా సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే సంబంధిత పత్రాలతో వెళ్లి సరిచేసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు.
– సూర్యప్రకాశరావు,
డీఎస్వో, శ్రీకాకుళం


