ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం మండలంలో లైసె న్స్ లేకుండా అల్లోపతి మందులను విక్రయిస్తున్న ఆర్ఎంపీ వైద్యుడి ఇంటిపై ఔషధ నియంత్రణ శాఖాధికారులు దాడులు నిర్వహించి సుమారు రూ.లక్ష విలువైన మందులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలలోకి వెళితే... లొద్దపుట్టి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు ఎ.అమిత్రాజ్రెడ్డి తన నివాసంలో సరైన అనుమతులు, లైసెన్స్ లేకుండా అల్లోపతి మందులు నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు సమాచారం మేరకు.. గురువారం ఔషధ నియంత్రణశాఖ సహాయ సంచాలకులు ఎం.చంద్రరావు, టెక్కలి డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎన్.యుగంధరరావులు సంయుక్తంగా తనిఖీ నిర్వహించి అల్లోపతి మందులను గుర్తించి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా మందుల నిల్వ, విక్రయాలు చేయడం ఔషధ చట్టం –1940 నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న మందులపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.


