కాసింత తేయాకు డికాక్షన్.. కాసిన్ని పాలు... కాస్త చక్కెర.. చాలు.. నీరసంగా ఉన్న ఒంటికి సత్తువ వచ్చేస్తుంది. మత్తుగా ఉన్న మెదడుకు ఉత్తేజం కలుగుతుంది. డీలా పడిపోతున్న మనిషికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. దంచిన అల్లం, పొడిగా మారిన యాలక్కాయ జత కలిశాయంటే ఆ ఐదు నిమిషాల తేనీటి పానానికి రససిద్ధి కలిగినట్టే. జేబులో డబ్బుల్లేని రోజుల్లో స్నేహితులతో వన్ బై టూ తాగిన టీ, డబ్బు సంపాదించాక కూడా అదే షాపు బయ ట నిలబడి దర్జాగా తాగిన చాయ్, కబుర్లు చెప్పుకుంటూ ఖాళీ చేసిన తేనీరు.. అన్ని దశ ల్లోనూ అండగా నిలిచిన పానీయమిది. అన్న ట్టు గురువారం ప్రపంచమంతా తేనీటి దినోత్సవం జరుపుకుంది. టీ తాగేందుకు మనకు ఉత్సవాలే కావాలా.. రోజూ టీ ఉత్సవమే కదా అంటున్నారు ఈ సైక్లింగ్ బృంద సభ్యులు. సైక్లింగ్ చేశాక అంతా ఓ చోటకు చేరి ఇలా ‘టీ’..కా తాత్పర్యాలు మాట్లాడుకుంటారు. – శ్రీకాకుళం కల్చరల్
మీటర్ గిరా..గిరా..
అరసవల్లి: వేసవిలో జిల్లా విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. గత వేసవితో పో ల్చుకుంటే ఈ ఏడాది మే నెలలో విద్యుత్ వినియోగం అమాంతం నాలుగు రెట్లు పెరిగిందని అధికారిక అంచనా. ఈనెల 14న 7.51 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగం కాగా.. దాన్ని బ్రేక్ చేస్తూ ఈనెల 18–19 తేదీల్లో ఏకంగా 7.96 మిలియన్ యూనిట్లు (79 లక్షల యూనిట్లు మించి) విద్యుత్ వినియోగం అయినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ అప్రకటిత కోతలు, కావాల్సిన డిమాండ్ అందించడం అనే అంశాలపై ఏమాత్రం దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత 20 రోజుల నుంచి పరిస్థితులు చల్లబడకపోవడం విద్యుత్ వినియోగంపై అత్యంత ప్రభావం చూపిస్తోంది.
జిల్లాలో నిరక్షరాస్యులు 1.32 లక్షల మంది
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాను శతశాతం అక్షరాస్యత దిశగా తీసుకెళ్లేందుకు అన్ని ప్రభు త్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరే ట్ వేదికగా ’ఉల్లాస్ అక్షర ఆంధ్ర’ అక్షరాస్యతా కార్యక్రమ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు ఎం. వెంకటరమణ సమావేశాన్ని ప్రారంభిస్తూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1,32,360 మంది నిరక్షరాస్యులను గుర్తించినట్లు తెలిపారు. వీరిని అక్షరాస్యులుగా మార్చడమే ‘ఉల్లాస్ అక్షర ఆంధ్ర’ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.


