హిరమండలం మేజర్ పంచాయతీలో తాగునీటి సమస్య లేకుండా చూ స్తాం. భూ గర్భ జలాలు ఎండిపోయాయి. గొట్టా బ్యారేజీ వద్ద ఉన్న ప్రధాన తాగునీటి (పంపు)బావి ని పరిశీలించాం. 30 అడుగుల నీటిమట్టం ఉండాల్సి ఉండగా 2 అడుగుల నీటిమట్టం ఉండటంతో మోటార్ వేస్తే ఓవర్ హెడ్ ట్యాంక్కు నీరు ఎక్కడం లేదు. త్వరలోనే తాగునీటి సమస్య పరిష్కరించి తాగునీరు అందిస్తాం.
– సాయి ప్రసాద్,
ఈఓ, హిరమండలం
● తాగునీటి కోసం రోడ్డెక్కిన హిరమండలం ప్రజలు
● అలికాం–బత్తిలి రోడ్డుపై నిరసన
● జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి
కుండల్లో నీటితో పాటు గుండెల్లో ఆశలు కూడా అడుగంటిపోతున్నాయి. ఖాళీ బిందెల సాక్షిగా పాలకులు నీరిస్తారనే కాంక్షలు నీరుగారిపోతున్నాయి. జనం రోడ్డెక్కితే గానీ అక్కడ నీటి సమస్య ఉందని తెలీని దుస్థితిలో నాయకులు ఉన్నారు. ఫలితంగా ట్యాంకర్ల ముందు నిరీక్షణలు, నీరివ్వని కుళాయిల ముందు ఆవేదనలు, దాహం తీరక ఆక్రందనలతో సగటు సిక్కోలు ఆడపడుచులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అలికాం–బత్తిలి రోడ్డుపై మహిళల నిరసన కేవలం ఆగ్రహం కాదు.. ప్రతి రోజూ వారు పడుతున్న ఆవేదన. జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
అలికాం–బత్తిలి ప్రధాన రహదారిపై నిరసన తెలుపుతున్న మహిళలు
హిరమండలం:
హిరమండలానికి దాహం తప్పడం లేదు. పక్కనే వంశధార ఉన్నా వీరికి మాత్రం తాగునీరు అందడం లేదు. కుళాయిల ద్వారా నీటి సరఫరా జరగక.. అటు ట్యాంకర్ల ద్వారా నీరు అందించకపోవడంతో హిరమండలం మేజర్ పంచాయతీ చిన్నకోరాడ పరిధిలోని మహిళలు, యువకులు రోడ్డెక్కా రు. అలికాం–బత్తిలి ప్రధాన రహదారిపై మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గంట సమయం పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. చివరకు పలువురు ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు కలుగజేసుకుని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి తాగునీటికి శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.
ఇదీ పరిస్థితి..
హిరమండలం మేజర్ పంచాయతీలో 18 వేల మంది జనాభా ఉన్నారు. ప్రతి మనిషికి రోజుకు సగటు న 20 లీటర్ల నీరు అవసరం. ఈ లెక్కన 3,60,000 లీటర్ల నీరు అందించాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడో దశాబ్దాల కిందట ఏర్పాటుచేసిన పైపులైన్, మంచినీటి పథకం సామర్థ్యం చాలడం లేదు. బావి లోపల సుమారు 30 అడుగుల లోతులో నీటిమట్టం ఉండాల్సి ఉండగా రెండు అడుగుల నీటమట్టం మాత్ర మే ఉంది. బావి మట్టి, ఇసుక, కావుతో నిండిపోయింది. అటు సమగ్ర మంచినీటి పథకం, జలజీవన్ మిషన్ వంటి పథకాలు ఏవీ అక్కరకు రావడం లేదు. వేసవి ముందస్తు చర్యలు లేవు. ఇటీవల ఒకే సారి నీటికి ఇబ్బందులు రావడంతో అప్పటికప్పు డు బోర్లు తవ్వి పథకానికి అనుసంధానం చేశారు. అయినా తాగునీరు అందని దుస్థితి. కుళాయిల ద్వా రా రోజువిడిచి రోజు నీరు అందిస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ట్యాంకర్లతో పాటు మేజర్ పంచాయతీ తాగునీటి ట్యాంకు ఉన్నా అంతంతమాత్రంగా నీరు అందించి చేతులు దులుపుకుంటున్నా రు. నడి వేసవి కావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మేజర్ పంచాయతీ ప్రజలు కోరుతున్నారు.
ఇచ్ఛాపురం: వాటర్ ట్యాంకర్ల వద్ద తాగునీటిని పట్టుకుంటున్న మహిళలు


