కంచిలి: మండలంలోని బూరగాం గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం 40 మంది యాత్రికులతో వెళుతున్న ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అదుపు తప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న కాలువలోకి వెళ్లి అక్కడ బోల్తా పడింది. అదృష్టవశాత్తు ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించలేదు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, గైడ్కు స్వల్ప గాయాలయ్యాయి. మిగతా ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వీరంతా అనంతపురం నుంచి కాశీ ఫుణ్యక్షేత్రానికి బస్సులో వెళుతున్నారు. మార్గ మధ్యంలో ప్రమాదం సంభవించడంతో భయభ్రాంతులకు లోనయ్యారు. దీనిపై కంచిలి ఎస్ఐ పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొత్తపెంట జెడ్పీ హైస్కూల్కు అరుదైన గౌరవం
జి.సిగడాం: కొత్తపెంట జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలకు అరుదైన గౌరవం దక్కింది. 2025 సంవత్సరంలో సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన వికసిత్ భారత్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి కొత్తపెంట విద్యార్థులు తయారు చేసిన స్మార్ట్ మ్యాన్హోల్ క్లీనింగ్ మెషిన్ ఎంపిక చేశా రు. ఈ ప్రాజెక్టు తయారు చేసిన పాఠశాల రూ.10వేల నగదు బహుమతికి ఎంపికై ందని జిల్లా సైన్స్ అధికారి కుమార్స్వామి ఆదివారం తెలిపారు. వికసిత్ భారత్ పోటీలో ఈ పాఠశాల ఎంపికపై జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు, ఉప విద్యాశాఖ అధికారి విజయకుమారి, ఎంఈఓలు అరసాడ రవి, ముల్లు శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు ఎస్.భానుమూర్తి, వి.రవి, ప్రాజెక్టు గైడ్ దున్న సురేష్కు అంతా అభినందనలు తెలిపారు.
కిడ్నీ వ్యాధి తగ్గక..
బాధతో బతకలేక
పొందూరు: గత కొద్ది నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ గడ్డి మందు సేవించడడంతో పరిస్థితి విషమించి తండ్యాం పంచాయతీ ఎస్ఆర్ఎన్ కాలనీకి చెందిన వవడగా గౌతమ్(22) ఆదివారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు కిడ్నీ సమస్య తీవ్రమవ్వడంతో ఈ నెల 7వ తేదీన గడ్డి మందు సేవించాడు. అయితే ఈనెల 12న పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుని తల్లి చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి ఎస్ఐ వి.సత్యనారాయణ అప్పగించారు.


