రణస్థలం: జాతీయ రహదారుల సంస్థ తరఫున ఎలాంటి పరిహారం చెల్లించకుండా తమ ఇళ్లు ఖాళీ చేయమని నోటీసులు ఇవ్వడం అన్యాయ మని బుడుమూరు బాధిత దళితులు వాపోయారు. లావేరు మండలంలోని బుడుమూరు గ్రామంలో జాతీయ రహదారి పక్కన ఉన్న జె.అప్పన్న, దుంగ బావాజి, కుప్పిలి ఆదిలక్ష్మి, కుప్పిలి రమణమ్మ, మున్నాన లక్ష్మి, అసిరమ్మలకు ఇళ్లు ఖాళీ చేయాలని హైవే అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా బాధిత దళితులు సోమవారం మాట్లాడుతూ రోడ్డు విస్తరణకు సంబంధించి తమకు ఎలాంటి పరిహారం రాలేదని తెలిపారు. ఉన్న ఫలంగా వెళ్లిపొమ్మంటే ఎక్కడకు పోవాలని ప్రశ్నించారు. ప్రభుత్వం తరఫున ఇంటి స్థలంతో పాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.
దొంగతనం కేసులో
నిందితుడికి జైలు శిక్ష
కొత్తూరు: పారాపురం గ్రామంలో ఉన్న సత్య సాయి బాబా మందిరంలో 28 తులాల బాబా వెండి పాదాలు దొంగతనం కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా కోర్టు విధించిందని ఎస్ఐ కె.వెంకటేష్ సోమ వారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. పారాపురంలోని సత్యసాయిబాబా మందిరంలో 2006లో రూ.56 విలువ గల 28 తులాల బాబా వెండి పాదాల దొంగతనం జరిగింది. అప్పట్లో పోలుమహంతి ప్రసాదరావుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయగా దొంగిలించిన బాబా వెండి పాదాలు స్వాధీనం చేసుకున్నామని, కేసు విచారణలో భాగంగా సోమవారం కొత్తూరు కోర్టు జూనియర్ సివిల్ జడ్జి కందికట్ల రాణి నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేలు జరిమానా విధించారని, జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించారని తెలిపారు. కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎల్.నాగభూషణం వాదించారని ఎస్ఐ తెలిపారు.
జిల్లాలో 1196 ‘జలధార’ పనులు ప్రారంభం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో భూగర్భ జల మట్టాన్ని పెంచడంతో పాటు, ప్రతి నీటి చుక్క ను ఒడిసిపట్టే లక్ష్యంతో ‘జలధార – జలహారతి’ పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధిలో జల సంరక్ష ణ కీలకమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 7,376 పనులను గుర్తించగా, ఇప్పటికే 3,925 పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశామని, ఇందులో 1,196 పనులు క్షేత్రస్థాయిలో విజయవంతంగా ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ముఖ్యంగా చెరువుల పూడికతీత, ఫీడర్ ఛానల్స్ పునరుద్ధరణ, చెరువు గట్ల పటిష్టత వంటి పనుల ద్వారా సాగునీటి వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
‘ప్రసన్న’మైన విజయం
శ్రీకాకుళం పాతబస్టాండ్: పదో తరగతి ఫలితాల్లో సరుబుజ్జిలి మండలం పెద్ద సవలాపురం గ్రామానికి చెందిన కోరాడ లక్ష్మీ ప్రసన్న అద్భుత ప్రతిభ కనబరిచింది. 600 మార్కులకు గాను 597 మార్కులు సాధించిన లక్ష్మీ ప్రసన్నను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం గ్రీవెన్స్లో అభినందించారు. లక్ష్మీ ప్రసన్న తండ్రి కోరాడ గున్నారావు ఇండియన్ ఆర్మీలో అధికారిగా పనిచేస్తున్నారు. తన విజయంపై లక్ష్మీ ప్రసన్న స్పందిస్తూ.. భవిష్యత్లో ఢిల్లీలోని ఎయిమ్స్ లో వైద్య విద్యను అభ్యసించి, ఉత్తమ డాక్టరుగా ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని వెల్లడించింది.
8న జాబ్మేళా
హిరమండలం: స్థానిక రామేశ్వరి డిగ్రీ కాలేజీలో ఈ నెల 8న జాబ్మేళా నిర్వహిస్తున్నారు. ఆయన్ బిజినెస్ సపోర్టు సొల్యూషన్ ఆధ్వర్యంలో 15 కంపెనీలు ఈ జాబ్మేళాలో పాల్గొంటున్నాయి. 18–40 ఏళ్ల వయసు గల గ్రాడ్యు యేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ చదివిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. వివరాలకు 6281318456, 9966903047 నంబర్లకు సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.


