సంతబొమ్మాళి: నౌపడలో ఆర్అండ్ఆర్ కాలనీ వద్ద నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, సాగునీటి సంఘాలు సమర్థంగా పని చేస్తే రైతులకు మెరుగైన నీటి పంపిణీ సాధ్యమవుతుందని అన్నారు. భవిష్యత్ తరాల కోసం నీటి వనరులను కాపాడుకోవడం అత్యంత అవసరమని ఆయన పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో కృష్ణమూర్తి, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కొబ్బరి చెట్టుపై పిడుగు
హిరమండలం: ఎల్ఎన్ పేట మండలంలోని తురకపేట కృష్ణాపురంలో సోమవారం సా యంత్రం ఉరుములతో కూడిన వర్షం కురియడంతో కొబ్బరి చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగాయి. సోమవారం సాయంత్రం తురకపేట ప్రాంతంలో ఒక్కసారిగా గాలులు చెలరేగి, ఉరుములతో కూడిన వర్షం పడింది.
పాలీసెట్ శిక్షణ తరగతులు ప్రారంభం
ఎచ్చెర్ల: స్థానిక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్లో సోమవారం ఉదయం నుంచి పాలీసెట్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ టి.విక్టర్ పాల్ మాట్లాడుతూ.. ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి 12. 30 వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామ న్నారు. హాజరైన విద్యార్థులకు ఉచిత మెటీరియల్ కూడా అందజేయనున్నారు.
‘నిర్దేశిత మెనూ అందించాలి’
ఎచ్చెర్ల: విద్యార్థులకు నిర్దేశిత మెనూ అందజేయాలని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య అమరేంద్ర కుమార్ సండ్ర అన్నారు. రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయంలో డైరెక్టర్ సండ్ర అమరేంద్ర కుమార్ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా మెస్ను సందర్శించారు. ఉదయం తయారు చేసిన అల్పాహారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహరం చేశారు. విద్యార్థులకు అందజేసిన ఆహారం క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పరిపాలన అధికారి ముని రామకృష్ణ, డీన్ శివ రామకృష్ణ, పైనాన్స్ ఆఫీసర్ వాసు, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ విభాగపతి శ్రీధర్ ఉద్యోగులు, సహచర ఉద్యోగులు ఉన్నారు.
‘గ్యాస్ డీలర్ పై దాడులకు పాల్పడితే గ్యాస్ సరఫరా నిలిపివేస్తాం’
ఇచ్ఛాపురం: రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా గ్యాస్ డీలర్లపై దాడులకు పాల్పడితే గ్యాస్ సిలిండర్ల సరఫరాని నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. ఇటీవల పట్టణంలో వినియోగ దారునితో అకారణంగా దాడికి గురైన స్థానిక ఎస్వీఎస్బీ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి వజ్రపు వెంకటే ష్ను వారంతా సోమవారం పరామర్శించారు. డీలర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం, ఆయిల్ కంపెనీల నిబంధనల మేరకే గ్యాస్ సరఫరాలు చేస్తున్నామని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల గ్యాస్ బుకింగ్ కాకపోతే గ్యాస్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఎవరైనా తప్పు చేసినా ఫిర్యాదుచేసేందుకు అనేక వ్యవస్థలు ఉన్నాయని, అలా కాకుండా దాడి చేయడం సరికాదన్నారు.


