హిరమండలం: గిరిజన బాలిక జయంతి అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. ఇటీవల జయంతి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. తెలిసిన వ్యక్తి కాలేజీలో చేర్పిస్తానని చెప్పి విగత జీవిగా ఇంటికి చేర్చాడు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు పోలీస్ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రెడ్డి శాంతి స్థానిక వైఎస్సార్సీపీ నేతలతో కలిసి మృతురాలి తల్లిదండ్రులు శ్రీను, రాధలను పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ తరుపున పోరాటం చేస్తామని చెప్పారు. ఆమెతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు.


