శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): బెంతు ఒరియా సమస్యపై తప్పుడు సమాచారం ఇస్తున్న ఎమ్మెల్యే బెందాళం అశోక్ అసత్యాల ప్రెస్మీట్పై పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, గిరిజనులపై ఇలా లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని గిరిజన సంఘాల జేఏసీ ముఖ్య సలహదారుడు వాబ యోగి అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు హొటల్లో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీలను అనరాని మాటలు అనేసి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళన చేశాక సుమారుగా 98 గంటల తర్వాత ప్రెస్ మీట్ ద్వారా క్షమాపణ అడగటం దారుణమన్నారు. బెంతు ఒరియాలు ఒడ్డి కులానికి చెందిన వారని టెక్కలి ఆర్డీఓ ప్రభుత్వానికి నివేదిక అందజేశారని గుర్తు చేశారు. ఎస్టీలుగా ఉద్యోగాలు పొందిన నలుగురు బెంతు ఒరియాల ఉద్యోగాలు రద్దు చేశారని తెలిపారు. జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శి గురాడి అప్పన్న, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి సింహాచలం మాట్లాడుతూ అశోక్ 15 ఏళ్లుగా పాలిస్తున్న ఇచ్ఛాపురం నియోజకవర్గంలో చాలా గ్రామాలకు రోడ్డు సదుపాయం కూడా లేదన్నారు. ఇళ్లు లేని ఆదివాసీలు ఉన్నారని, దానికి ఆయన బాధ్యులు కారా అని ప్రశ్నించారు. బెంతు ఒరియాలపై పూర్తిగా ఈ ప్రభుత్వ అధ్యయనం చేసి నకిలీ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరారు. ఏ రాజకీయ పార్టీ వ్యక్తులైనా ఆదివాసుల గురించి తప్పుగా మాట్లాడితే ఇక క్షమించేది ఉండదని హెచ్చరించారు.


