శ్రీకాకుళం పాతబస్టాండ్ : గొట్టా బ్యారేజీలోని నీటిని వృథాగా విడిచిపెట్టేస్తున్నారని, దీని వల్ల రబీ పంట చివరి దశలో ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో భగీరథపురం, నీలదేవిపురం, గొడియపాడు, మహాలక్ష్మిపురం, పిండ్రువాడ, అంబావల్లి, రెల్లివలస, అక్కరాపల్లి, కిట్టాలపాడు తదితర గ్రామాల వారు మంగళవారం ఉన్నతాధికారులకు విన్నవించారు. కలెక్టర్ లేకపోవడంతో అందుబాటులో ఉన్న డీఆర్వో ఎస్వీ లక్ష్మణమూర్తికి వినతిపత్రం అందించారు. పై గ్రామాల్లో ఈ రబీసీజన్లో సుమారు 2 వేల ఎకరాల్లో సాగు చేస్తున్న మొక్కజొన్న, వరి కోత దశకు వచ్చాయని, మరో 15 రోజుల్లో పంట చేతికి అందుతుందని, ఇలాంటి సమయంలో బ్యారేజీ గేట్లు పైకెత్తి నీటిని వదిలేయడం రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లేనని రెడ్డి శాంతి పేర్కొన్నారు. రైతులు ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావులను కలిసి పలుమార్లు విన్నవించుకున్నా స్పందించడం లేదన్నారు. అన్నదాత సుఖీభవ డబ్బులు అందరికీ పడడం లేదని, సాగునీటి విషయంలోనైనా న్యాయం చేయాలని రెడ్డి శాంతి వినతిపత్రంలో కోరారు.


