జలుమూరు: అందవరంలో గ్రామ దేవత పండగలో భాగంగా మంగళవారం సిరిమాను ఉత్సవం అంబరాన్ని తాకింది. సిరిమానును ప్రత్యేకంగా పూలు, పసుపు కుంకుమ, నూతన వస్త్రాలతో అలంకరించారు. ముందుగా గణపతి పూజతో ప్రారంభించి అమ్మవారికి, సిరిమానుకి ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయం ప్రకారం రాజుబాబు ఇంటి నుంచి సిరిమానును ప్రారంభించారు. ఆచారం ప్రకారం అందవరపు కుటుంబీకులైన అందవరపు రాము సిరిమాను అధిరోహించారు. మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు డీసీసీబి మాజీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ వాన గోపి, మాజీ ఎంపీపీ బగ్గు రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కనుసు సీతారాం, పైడి విఠలరావు, రేగాన శ్యామ్, బగ్గు గౌతమ్పిట్ట ప్రసాద్, పొన్నాడ విజయ్, ఎస్.ఆదిబాబు, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.


