శ్రీకాకుళం పాతబస్టాండ్: రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎలాంటి ప్రాణ, పశు నష్టం జరగకుండా ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి రాష్ట్ర హోం, విపత్తు నిర్వహ ణ శాఖ మంత్రి వంగలపూడి అనిత నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండలంలో వారం వారం సమీక్ష సమావేశాలు నిర్వహించి, ఎండల తీవ్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఉపాధి హామీ పనుల వద్ద కూలీల కోసం మంచినీరు, నీడ కోసం షేడ్ నెట్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశించామన్నారు.
పట్టణ ప్రణాళికా విభాగంలో ఏసీబీ సోదాలు
శ్రీకాకుళం క్రైమ్ : శ్రీకాకుళం పురపాలిక కార్యాలయంలోని పట్టణ ప్రణాళికా విభాగంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఏసీబీ సోదాలు జరిగాయి. రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు ఏసీబీ సీఐలు ఎస్వీ రమణ, భాస్కర్ తమ సిబ్బందితో కలిసి పలు రికార్డులు, కంప్యూటర్ హార్డ్ డిస్క్లు పరిశీలించారు. హాజరు పట్టీలో సంతకాలు చేసిన అధికారులు విధుల్లో ఉన్నదీ లేనిదీ ఆరా తీసిన అనంతరం అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ–1), వెంకటేశ్వరరావు, టౌన్ సర్వేయర్ పీవీ రమణ ఇతర సిబ్బందిని విచారించారు. పలు రికార్డులను స్వాధీన పర్చుకోవడమే కాక కంప్యూటర్ హార్డ్ డిస్క్ల్లో ఉన్న డేటాను తమ ల్యాప్టాప్ల్లో అప్లోడ్ చేశారు. ఇదే విషయమై ఏసీబీ డీఎస్పీ కెంబూరి సత్యనారాయణను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా తాను విజయవాడలో ఉన్నానని, ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఈ ఆకస్మిక సోదాలు తమ సీఐల ఆధ్వర్యంలో జరిగాయన్నారు.
నాలుగు కిలోల గంజాయితో యువకుడు అరెస్టు
ఎచ్చెర్ల : కుఽశాలపురం నుంచి శ్రీకాకుళం బైపాస్ రోడ్డులో 4.1 కిలోల గంజాయితో వెళ్తున్న ఒడిశాకు చెందిన యువకుడిని ఎచ్చెర్ల పోలీసులు పట్టుకున్నారు.ఈ మేరకు జేఆర్పురం సీఐ ఎం. అవతారం, ఎచ్చెర్ల ఎస్సై జి.లక్ష్మణరావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా ఆస్రా తాలుకా మంగల్పూర్ గ్రామానికి చెందిన శ్రీహరిప్రదాన్ ఓ బ్యాగ్లో రెండు ప్యాకెట్లతో 4.1 కిలోల గంజాయి తరలిస్తుండగా ఎస్సై లక్ష్మణరావు, డిప్యూటీ తహశీల్దార్, సిబ్బంది కలిసి పట్టుకున్నారు. బెంగళూరులోని భరత్ అనే వ్యక్తికి అప్పగిస్తే రూ.పది వేలు ఇస్తారని చెప్పడంతో గంజాయి తీసుకెళ్తున్నట్లు నిందితుడు తెలియజేసినట్లు పోలీసులు వెల్లడించారు.
● వైఎస్సార్ సీపీ
జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జిల్లా వ్యాప్తంగా ఈ నెల 12న నిర్వహించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 15 వసంతాలు పూర్తి చేసుకొని 16వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా మార్చి 12న వాడవాడనా ఆవిర్భావ దినోత్సవాలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గడిచిన 15 ఏళ్లలో పార్టీ అనేక సవాళ్లను అధిగమించిందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నంత కాలం పేదలకు అండగా నిలిచిందన్నారు. ప్రస్తుతం కూటమి పాలన అప్రజాస్వామికంగా కొనసాగుతోందని, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తున్నామని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు అందరూ సమైక్యంగా పండగ వాతావరణంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.


