● గ్యాస్ సరఫరా నిలుపుదల
● ప్రభుత్వ వసతి గృహాలు, కేజీబీవీలకు తప్పని ఇబ్బంది
● రెస్టారెంట్లకు సరఫరా కాని కమర్షియల్ గ్యాస్ సిలిండర్
● ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని మౌఖిక ఆదేశాలు
శ్రీకాకుళం:
వంటింటిలో మంట రాజుకునేలా ఉంది. కొన్నాళ్లుగా వంట గ్యాస్ కొరతపై ప్రచారా లు సాగుతున్నాయి. తాజాగా వంటగ్యాస్ సరఫరాను ప్రభుత్వ వసతి గృహాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లతో పాటు వాణిజ్యపరమైన సిలిండర్లు వినియోగించే రెస్టారెంట్లు, హోటళ్లకు సైతం నిలుపుదల చేశారు. ఇది విస్మయానికి గురిచేస్తోంది. మంగళవారం జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ సరఫరాను నిలుపుదల చేశాయి. కొన్ని గృహాలకు మాత్రమే సరఫరా చేశారు. అది కూడా పూర్తిస్థాయిలో సరఫరా జరగలేదు. ఏజెన్సీలకు ప్రధాన కేంద్రాల నుంచి గ్యాస్ సరఫరా కాకపోవడంతోనే ఇలాటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గ్యాస్ కోసం వెళ్లిన రెస్టారెంట్ ప్రతినిధులు, హాస్టళ్లు, కేజీబీవీలు మోడల్ స్కూళ్ల ప్రతినిధులకు గ్యాస్ ప్రస్తుతం సరఫరా చేయలేమని చెప్పడంతో వారంతా ఏం చేయాలో తెలీక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోయారు. కొందరి దగ్గర కొంత స్టాకు ఉండడంతో మంగళవారం ఏదోలా వంటలు చేసినప్పటికీ బుధవారం కనుక గ్యాస్ సరఫరా చేయని పక్షంలో రెస్టారెంట్లలో సగానికి పైగా మూతపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే హాస్టల్లో కూడా వంటలు చేసే పరిస్థితి లేకుండా పోతుంది.
ఇదిలా ఉండగా రాష్ట్రస్థాయిలో మంగళవారం కేజీబీవీలు, వసతి గృహాలకు చెందిన అధికారులతో జరిగిన సమావేశంలో వంటలకు ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. సమావేశంలో ఉండగానే పలు జిల్లాల నుంచి అధికారులకు వంట గ్యాస్ సరఫరా నిలుపుదల చేసిన విషయం తెలియడంతో వారు రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కట్టెల పొయ్యి గానీ, ఇతర మార్గాల ద్వారా గానీ వంట చేసుకునే ఏర్పాట్లు చేసుకోవాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే ముందు ముందు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది.


