● ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలకు ఎంపిక
పొందూరు: మండలంలోని గోకర్నపల్లి గ్రామానికి చెందిన గురుగుబెల్లి రవికుమార్ ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలకు ఎంపికై సత్తాచాటాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, గ్రామీణ బ్యాంక్ ఆఫ్ తెలంగాణాల్లో పీవో ఉద్యోగానికి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ తెలంగాణలో క్లర్క్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దీంతో తల్లిదండ్రులు జి.సత్యనారాయణ, రాధ ఆనందం వ్యక్తం చేశారు. యువకుడికి ఎంపీపీ కిల్లి ఉషారాణి, మాజీ ఎంపీటీసీ సీపాన శ్రీరంగనాయకులు, కిల్లి నాగేశ్వరరావు, విశ్రాంత జూనియర్ లెక్చరర్ జి.అప్పలనాయుడులు అభినందనలు తెలిపారు.
అంగన్వాడీల వేతనాలు పెంచాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలు పెంచడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షురాలు కె.నాగమణి, జిల్లా కార్యదర్శి ఎన్వీ రమణ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు ఎన్.హైమావతి, పి.లతాదేవి, వి.హేమలత, బి.ఆదిలక్ష్మి, కె.హైమావతిలు డిమాండ్ చేశారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేతనాలు పెంచాలని కోరుతూ ఈనెల 11న నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే ధర్నాలు జయప్రదం చేయాలని కోరారు. ఇటీవల విజయవాడలో చేపట్టిన ధర్నాలో భాగంగా అక్రమంగా అరెస్టులు చేయడాన్ని ఖండించారు. పోలీసు నిర్బంధాన్ని అభ్యుదయవాదులు, లౌకిక వాదులందరూ తీవ్రంగా ఖండించాలని కోరారు. అంగన్వాడీల 10 డిమాండ్లలో 9 డిమాండ్లు పరిష్కరించామని శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసన మండలిలో చేసిన ప్రకటన చేయడం అసత్యమని తెలిపారు.
ఎస్పీ గ్రీవెన్సుకు 47 వినతులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార వేదిక కార్యక్రమానికి (గ్రీవెన్సుకు) బాధితుల నుంచి 47 వినతులు అందాయి. అదనపు ఎస్పీ కేవీ రమణ వినతులు స్వీకరించి, సకాలంలో న్యాయం చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు.


