అచ్చెన్నకు ఆటవిడుపు
ప్రజలకు డయేరియా జడుపు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
శ్రీకాకుళం నగరంలో డయేరియా మరింత విస్తరిస్తోంది. నగరంలో మిగతా ప్రాంతాలకు పాకింది. చాప కింద నీరులా అనే కంటే అంతకంటే ఎక్కువగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఎక్కడ ఏ కేసులున్నాయో కూడా తెలియడం లేదు. అధికారులు కూడా కేసుల విషయాన్ని ధ్రువీకరించడం లేదు. తెలియని మరణాలు సంభవిస్తున్నాయి. మరోవైపు నగరమంతా అధికారుల అలర్ట్ అయ్యారు. గత వారం రోజులుగా ప్రబలుతున్న డయేరియా అదుపులోకి రావడం లేదు సరికదా మరింత ఎక్కువవుతోంది. రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.
మంత్రులూ మీకిది తగునా..
వారం రోజులుగా సొంత జిల్లా కేంద్రంలో డయేరియా ప్రబలి.. ప్రజలు మరణిస్తుంటే దగ్గరుండి పరిస్థితిని చక్క దిద్దాల్సిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు జిల్లాలో అడ్రస్ లేకుండా పోయారు. ఫోన్లతోనే గడిపేస్తున్నారు. డయేరియాతో నగరం అతలాకుతలం అవుతుంటే అమరావతిలో ఆటవిడుపు అంటూ ఆటలాడుకుంటున్నారు. డయేరియా ప్రబలిందని తెలిసినా కూడా జిల్లాకు రాలేదు. రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్న చందంగా అచ్చెన్నాయుడు సేదతీరుతున్నారు. ఒక మంత్రిగా, జిల్లాకు చెందిన నేతగా బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి ప్రజలకు అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా మంత్రే కాదు ఇన్చార్జీ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కూడా అదే తరహాలో వ్యవహరించారు. ఆయన కూడా బాధ్యతగా శ్రీకాకుళం నగరంలో పర్యటించి బాధితులకు అండగా నిలవాల్సింది పోయి చోద్యం చూస్తున్నారు.
విస్తరిస్తున్న అతిసార వ్యాధి
రోజురోజుకీ పెరుగుతున్న కేసులు
కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
సరిపోని సర్కారు సాయం
మంచి నీటి ట్యాంక్లో ఏం లభ్యమైంది..?
ఆటవిడుపులో మంత్రి అచ్చెన్నాయుడు
నగరానికి నీరు అందించే ఒక ట్యాంక్లో ఏదో జరిగిందని.. మరేదో బయట పడిందని నగరమంతా ప్రచారం జరుగుతోంది. దాని వల్ల మంచి నీళ్లు కలుషితమై ఈ పరిస్థితి ఏర్పడిందని చర్చ నడుస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాల్సిన అధికారులు నోరు మెదపడం లేదు. మరో వైపు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విస్తృతంగా నగరమంతా పర్యటిస్తున్నారు. కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్లి పరిశీలించడం వల్ల ఏదో జరుగుతోందనే చర్చతో పాటు ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరణాల నుంచి రోగుల సంఖ్య వరకు అంతా గోప్యంగా ఉంచుతున్నారు.


