సముద్రంలో మునిగిపోయిన బోటు
సోంపేట: మండలంలోని ఇస్కలపాలేం గ్రామానికి చెందిన మత్స్యకారులు ఎస్.డిల్లేష్, బి.కామరాజుల బోటు సముద్రంలో మునిగిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మత్స్యకారులు మంగళవారం సాయంత్రం వేట ముగించుకొని బోటును సముద్రంలో లంగరు వేసి ఇంటికి చేరుకున్నారు. అనంతరం బుధవారం ఉదయం మరలా చేపల వేటకు వెళ్లేందుకు సముద్రంలోకి వెళ్లగా లంగరు వేసిన బోటు కనిపించలేదు. దీంతో తీవ్రంగా గాలించారు.
అనంతరం సముద్రం లోపలే బోటు మునిగిపోయిందని గమనించి తాళ్ల సాయంతో ఒడ్డుకు లాగారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.12 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు వాపోయారు. బోటు మునిగిపోయిన విషయం తెలియగానే వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాం ప్రసాద్ రెడ్డి ఇసకలపాలేం గ్రామానికి చేరుకొని మత్స్యకారులతో మాట్లాడారు. అధికారులు స్పందించి బాధితులకు నష్ట పరిహారం అందజేయాలని కోరారు. ఆయనతో పాటు బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్, పలాసపురం సర్పంచ్ తడక జోగారావు, స్థానిక ఎంపీటీసీ బి.తిరుపతి తదితరులు ఉన్నారు.


