
మా జీవితాలు ఇంతేనా?
సమగ్ర శిక్ష, విద్యాశాఖలో చాలీచాలని వేతనాలు
ఇబ్బందుల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు
కనికరించని కూటమి పాలకులు
వేతనాలు పెంచాలి
ఉద్యోగ భద్రత కల్పించాలి
హిరమండలం:
సమగ్రశిక్ష, విద్యాశాఖలో చిరుద్యోగులైన సీఆర్ ఎంటీ (క్లస్టర్ రిజర్వు మొబైల్ టీచర్స్), మండల లెవల్ అకౌంటెంట్లు, ఎంఐఎస్ కోఆర్టినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు చాలీచాలని వేతనాలతో కుటుంబాలను భారంగా నెట్టుకొస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరుకులు, ఇంటి అద్దె లు, ఖర్చులతో దిక్కుతోచని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా జీతాలు పెరగ డం లేదని, ఉద్యోగ భద్రత లేకుండా ఉండటం లేదని ఆందోళన చెందుతున్నారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్న సుప్రీంకోర్టు తీర్పు ను పాలకులు అమలు చేయకపోవడం తగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా మండల వనరుల కేంద్రాలలో 224 మంది సీఆర్ఎంటీలు, 15 మంది మండల లెవల్ అకౌంటెంట్లు, 30 మంది ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, 30 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 30 మంది మెసెంజర్లు పనిచేస్తున్నారు. వీరంతా 2012లో ఉద్యోగాల్లో చేరారు. అప్పట్లో వీరికి నెలకు రూ. 18500 జీతం అందేది. తర్వాత వచ్చిన పాలకులు జీతాలు విస్మరించగా 2020లో వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రూ.23,500కు వేతనం పెంచారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరునెలల్లోనే కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్న పథకాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, స్థానిక సంస్థలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమమ్ టైం స్కేల్ వర్తింప చేయరాదని 2025 జనవరిలో జీవో నంబర్ –2 విడుదల చేసింది. ప్రభుత్వ శాఖలలో మంజూరైన ఖాళీ పోస్టులలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రమే అర్హులని తేల్చింది. ఈ జీవో రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు విరుద్ధమని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంద్రప్రదేశ్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సరైన వేతన నిబంధనలు అమలు కావడం లేదని వాపోతున్నారు.
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినా అమలు చేయడం లేదు. ఇటీవల ఎన్టీఆర్ భరోసా పెన్షన్, నూతన రేషన్ కార్డులు, తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేసినప్పటికీ చిరుద్యోగులకు వర్తింపచేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర ధరలు, రవాణా ఖర్చులు, వైద్యఖర్చులు, ఇంటి అద్దె విపరీతంగా పెరగడంతో జీతాలు సరిపోవడం లేదని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వాపోతున్నారు. నెలవారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతం పెంపుతో పాటు రిటైర్మెంట్ వయసు పెంపు, ఆరోగ్య భద్రత, పిల్లల విద్య, ఇంటి అద్దె భృతి, రేషన్ సబ్సిడీ పథకాలు, పదవీ విరమణ ప్రయోజనాలు వంటివి ప్రత్యేకంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జీతాలు పెరగక ఇబ్బందు లు పడుతున్నాం. నిత్యావసర ధరలు, రవాణా, వైద్యం, ఇంటి అద్దె వంటి ఖర్చులు విపరీతంగా పెరగడంతో కుటుంబ పోషణ భారమవుతోంది. నెల వారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి జీతాలు పెంచాలి.
– కె.చంద్రరావు, సీఆర్ఎంటీ, అవలంగి క్లస్టర్, హిరమండలం
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్ర త కల్పించాలి. చాలీచాలనీ జీతాలతో ఇబ్బందులు పడుతున్నాం. ఉపాధ్యా యుల మాదిరిగానే సెలవులు వర్తింపచేయాలి. ఉద్యోగ విరమణ 62 ఏళ్లకు పెంచి రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలి.
– పోలాకి తవిటినాయుడు,
సీఆర్ఎంటీ జిల్లా అధ్యక్షుడు

మా జీవితాలు ఇంతేనా?

మా జీవితాలు ఇంతేనా?

మా జీవితాలు ఇంతేనా?