
రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధ పాలన
● పేరుకే కూటమి ప్రభుత్వం..నడిపించేదంతా టీడీపీయే ● ‘సాక్షి’తో మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం రూరల్:
రాష్ట్రంలో రాజ్యంగబద్ధంగా పాలన సాగడం లేదని మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు అన్నారు. గురువారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పాలన, సంపద అందరికీ అందాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఐదేళ్లు పరిపాలించారని చెప్పారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు రూ.లక్ష కోట్లు ఒకే రాజధానికి పెడితే మిగిలిన ప్రజలు ఏం కావాలని, మళ్లీ వచ్చిన ప్రభుత్వాలు ఆ లక్ష కోట్లు అప్పు తీర్చే పనిలో ఉండాలా? అని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. నాయకుడికి ప్రత్యేక బాధ్యత ఉంటుందని, అందరూ నాయకులుగా ఎదగాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీలో కష్టపడే ప్రతిఒక్కరికీ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. కష్టపడే తత్వం, చిత్తశుద్ధితో పనిచేస్తే అవకాశాలు తప్పక వస్తాయన్నారు. అందరి సహకారంతో వైఎస్సార్సీపీ తిరుగులేని శక్తిగా మారుతోందన్నారు. పార్టీలో ఇటీవల వివిధ పదవులు స్వీకరించిన వారంతా క్రమశిక్షణతో మెలగాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సంపూర్ణ నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు.
రాష్టంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చాయని, ప్రస్తుతం టీడీపీ మాత్రమే అధికారాన్ని చలాయిస్తోందని ధర్మాన విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం లేదని, తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే నడుస్తోందన్నారు. బీజేపీ, జనసేన పాత్ర ఏమీ లేదన్నారు. కేవలం టీడీపీ నేతలు మాత్రమే కూటమి ప్రభుత్వం అంటూ ఢంకా మోగిస్తున్నారని, చేసిన పాపాలు ఇతర పార్టీలపై నెట్టేయాలనే ధోరణితోనే తెలుగుదేశం అలా వ్యవహరిస్తోందని చెప్పారు.
రెడ్బుక్ పేరుతో వైఎస్సార్ సీపీ నేతలను వేధించడమే పనిగా పాలకులు వ్యవహరిస్తున్నారని ధర్మాన ధ్వజమెత్తారు. వేధింపులపై ఎవరూ ఆందోళన చెందవద్దని, మనకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉన్నారని భరోసా ఇచ్చారు. సమాజంలో అట్టడుగు వర్గాలు, రైతులు, కార్మికుల ప్రయోజనాలు కోసం వైఎస్సార్ సీపీ పనిచేస్తోందని స్పష్టం చేశారు.
అమరావతి రాజధాని ప్రాంతం చిన్న వర్షానికే చెరువులను తలపిస్తోందని ధర్మాన విమర్శించారు. చిన్నపాటి రాజధాని చెరువు అయితే అది కనిపించకూడదని చంద్రబాబు ప్రభుత్వం తన అనుకూల మీడియాతో మేనేజ్ చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఇలాంటివి బయట ప్రపంచానికి తెలియాలంటే సోషల్ మీడియా ద్వారానే సాధ్యపడుతుందన్నారు. ఈ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, నిజాన్ని నిర్భయంగా వెలికి తీయాలని ధర్మాన పిలుపునిచ్చారు.