
మద్యం దందా!
అదనపు వసూళ్లు..
జలుమూరు: కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం దందాకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. జలుమూరు మండలం కొమనాపల్లి కేంద్రంగా గ్రామాల్లోని బెల్టుషాపులకు మద్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అటు సరుబుజ్జిలి, ఇటు హిరమండలం వరకూ ఇక్కడి వైన్ షాపు నుంచి మందు సరఫరా జరుగుతోంది. షాపు నిర్వాహకులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నా ఏ ఒక్క అధికారీ పట్టించుకున్న దాఖలాలు లేవు. వాస్తవానికి ఇక్కడ పర్మిట్ రూమ్కు అనుమతులు లేవు. అయినా షాప్ చుట్టూ దాబా, నూడిల్స్, ఇతర తినుబండారాలు షాప్లు పెట్టి అక్కడే కుర్చీలు, బెంచీలు వేసి బహిరంగంగా మందుబాబులు మద్యం సేవిస్తుంటారు. ఈ సమయంలో సంబంధిత ఎకై ్సజ్ శాఖ అధికారులు వచ్చినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం రికార్డులు తనిఖీలు చేసి అమ్మకాలు, కొనుగోళ్లు చూస్తున్నారే తప్ప బెల్ట్ షాప్లు, మద్యం అక్రమ రవాణాపై కనీసం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏ ఊరుకెళ్లినా బెల్టుషాపులే..
కొమనాపల్లి మద్యం షాప్ నుంచి ఇటు సరుబుజ్జిలి మండలం తెలికిపెంట, యరగాం, పాతపాడు, చిన్నకాగితాపల్లి, పెద్దమాలపేట, అగ్రహారం, లొద్దలకాగితాపల్లి తోపాటు మరో 20 గ్రామాలు, అటు హిరమండలంలోని కిట్టలపాడు కాలని, అక్కరాపల్లి, రెల్లివలస, అంబావిల్లి, పిండ్రువాడతోపాటు మరో 15 గ్రామాలు, జలుమూరు మండలం కొమనాపల్లి, శ్రీముఖలింగం, నగిరికటకం, కరకవలస, యలమంచిలి, తిమడాం, అల్లాడ, పర్లాం, మాకివలస, అందవరం మరో 16 గ్రామాలకు ఈ షాప్ నుంచి మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం.
మంత్రి బంధువులనే వెనుకంజ..
కొమనాపల్లి మద్యం షాపు నిర్వాహకులు జిల్లాకు చెందిన మంత్రి సమీప బందువు. ఎకై ్సజ్ కార్యాలయం కూడా మంత్రి ఇలాకాలోని కోటబొమ్మాళిలో ఉండటంతో అధికారులు తనిఖీలకు వెనకంజ వేస్తున్నారని పలువురు చెబుతున్నారు.
ఫిర్యాదు రాలేదు..
ఈ విషయమై కోటబొమ్మాళి ఎకై ్సజ్ శాఖ ఎస్ఐ ఆర్.సీత వద్ద ప్రస్తావించగా కొమనాపల్లి మద్యం షాపుపై మాకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు. అయినా సిబ్బందితో వెళ్లి తనిఖీలు నిర్వహించి అక్రమాలు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు.
షాపు ఉదయం తెరిచిన వెంటనే ఆయా బెల్ట్షాప్లు, పర్మిట్ రూమ్ నిర్వాహకుల సెల్కు మెసేజ్ వెళ్తుంది. వెంటనే వారు వచ్చి ఆటో, ద్విచక్ర వాహనాల ద్వారా దర్జాగా మద్యం బాటిళ్లు తీసుకెళ్లిపోతారు. ఉదయం 9 గంటల లోపల అవసరం పడితే ఒక్కో క్వార్టర్ బాటిల్కు రెట్టింపు ధర వసూలు చేస్తున్నారు. అదే 10 గంటలు దాటితే క్వార్టర్ బాటిల్కు రూ.50 అదనం. బెల్ట్షాప్, పర్మిట్ రూమ్లకు షాప్ నిర్వాహకులే నేరుగా మద్యం తీసుకెళ్తే క్వార్టర్కు రూ.70 వరకు వసూలు చేస్తుంటారు. రెండు నుంచి మూడు కిలోమీటర్లు దూరమైతే కాస్త ధర తగ్గించి అమ్మకాలు చేస్తున్నారు.
యథేచ్ఛగా బెల్టుషాపులకు మద్యం తరలింపు
అనుమతులు కొన్ని గ్రామాలకే.. అమ్మకాలు రెండు మండలాలకు..
క్వార్టర్ బాటిల్పై అదనంగా రూ.50 వసూలు!
తూతూమంత్రంగా అధికారుల తనిఖీలు