
చోరీకి గురైన బైకులు స్వాధీనం
పొందూరు: చోరీకి గురైన నాలుగు బైకులను, ఓ లగేజీ ఆటోను టెక్నాలజీ సాయంతో స్వాధీనం చేసుకున్నామని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు. పొందూరు పోలీసుస్టేషన్ పరిధిలో చోరీకి గురైన వాహనాలు స్వాధీనం చేసుకోవడంతో గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని పలు గ్రామాల్లో కార్డన్సెర్చ్ చేస్తున్న సమయంలో తమ బైకులు చోరీకి గురైనట్లు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. బైక్ను పోగొట్టుకున్న యజమాని ఫోన్కు వచ్చిన మెసేజ్ ఆధారంగా సాంకేతికతను ఉపయోగించుకుని బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం మంగువారి తోటకు చెందిన బొమ్మలాట మోహనరావు, బొమ్మలాట ఢిల్లీశ్వరరావు, తోట శ్రీనివాసరావు, మెండ శివలు వాహనాలు చోరీ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. వీరిలో బైకు దొంగతనం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మోహనరావు మూడు ద్విచక్రవాహనాలను, ఢిల్వీశ్వరరావు ఒక ద్విచక్రవాహనాన్ని చోరీ చేసినట్లు తెలిపారు. తోట శ్రీనివాసరావు, మెండ శివలు కొత్తూరులో చోరీ చేసిన లగేజి ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇటువంటి చోరీ చేసిన వాహనాలను ఢిల్లీశ్వరరావు కొనుగోలు చేసి విక్రయిస్తుంటాడని తెఇపారు. నాలుగు ద్విచక్రవాహనాలు, లగేజి ఆటోను ఢిల్లీశ్వరరావు నుంచి స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ వాహనాలన్నీ పొందూరు మండలం రాపాక గ్రామసుతలకు చెందినవిగా గుర్తించామని చెప్పారు. జైలులో ఉన్న మోహనరావును పూర్తి స్థాయిలో విచారిస్తే మరికొన్ని ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకొనే అవకాశం ఉందన్నారు. చోరీకి గురైన వాహనాల విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని చెప్పారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన ఎస్సై వి.సత్యనారాయణ, సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు తెలిపారు. డీఎస్పీతో పాటు సీఐ పి.సత్యనారాయణ, ఎస్ఐ వి.సత్యనారాయణ, ట్రైనీ ఎస్ఐ మోహిని, పోలీసు సిబ్బంది ఉన్నారు.
సమస్మాత్మకత గ్రామాలపై దృష్టి...
నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారించినట్లు డీఎస్పీ తెలిపారు. పొందూరు మండలంలో ఇప్పటి నుంచే సమస్యాత్మక గ్రామాలలో సమావేశాలు నిర్వహించి వివాదాలు లేకుండా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈసారి బైండోవర్ కేసులలో చిక్కుకుంటే రూ. 2 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.