
జాప్యమెందుకో?
స్పోర్ట్స్ కోటా అమల్లో..
● ఇంజినీరింగ్, ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లలో కానరాని కోటా ● శాప్ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం ● ప్రభుత్వం స్పందించాలని క్రీడాసంఘాల విజ్ఞప్తి
శ్రీకాకుళం న్యూకాలనీ: స్పోర్ట్స్ కోటా అమలు రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనుక్కి అన్న చందంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాను పక్కాగా అమలు చేస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కాక వందలాది మంది క్రీడాకారులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఇంజినీరింగ్, ట్రిపుల్ ఐటీ క్లాసులు మొదలైపోయాయి. అయినా, స్పోర్ట్స్ కోటా ద్వారా భర్తీ కావాల్సిన సీట్లను సంబంధిత శాఖాధికారులు జాప్యం చేస్తుండటంతో విద్యార్థులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జిల్లాలో పదుల సంఖ్యలో క్రీడాకారులు.. విద్యార్థులు ఎంసెట్, ట్రిపుల్ఐటీ సీట్ల రేసులో ఉన్నారు. వీరంతా ఇప్పటికే వివిధ క్రీడాంశాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించి జిల్లా కీర్తిని చాటిచెప్పారు. పతకాలు సాధించి సత్తాచాటారు. అయితే ఉన్నత చదువుల్లో అమలు కావాల్సిన స్పోర్ట్స్కోటాను అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో విద్యాసంవత్సరం కోల్పోయే పరిస్థితులు దాపరించాయి.
డీఎస్సీపైనే ఫోకస్..
స్పోర్ట్స్ కోటా భర్తీ చేపట్టాలని ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్)కు ఆదేశించింది. అయితే శాప్ అధికారులు కేవలం డీఎస్సీ ఉద్యోగాలపై మాత్రమే ప్రస్తుతం ఫోకస్ చేస్తున్నారు. మిగిలిన ఉన్నత, ప్రొఫెషనల్, వృత్తివిద్యా కోర్సుల ప్రవేశాల సందర్భంగా స్పోర్ట్స్కోటా ద్వారా విద్యార్థుల భర్తీని విస్మరించారు. దీంతో ఎంసెట్, ట్రిపుల్ ఐటీ వంటి ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు నష్టపోతున్నారు. ఇప్పటికై న ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని జిల్లాలోని క్రీడా విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు. విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్పోర్ట్స్ కోటా భర్తీకి వెంటనే చర్యలు చేపట్టాలని ఒలింపిక్ సంఘ నాయకులు, క్రీడాసంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు.